“ఆలస్యం అవొచ్చు కానీ, తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడటం ఖాయం. అవినీతికి పాల్పడిన నేతలను ఉపేక్షించే ప్రసక్తే లేదు..నేరస్థుల్లారా ఖబడ్దార్.. నా దగ్గర మీ ఆటలు సాగవు” అంటూ కడప వేదికగా జరుగుతోన్న మహానాడులో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. వరుసగా రెండు రోజులుగా చంద్రబాబు మహానాడులో ఈ హెచ్చరికలు చేస్తుండటంతో ఎవరిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది.
అవినీతికి పాల్పడిన నేతలను వదిలిపెట్టనంటూ మహానాడు మొదటి రోజు కామెంట్స్ చేసిన చంద్రబాబు.. రెండోరోజు వివేకా హత్య కేసును ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. వివేకా హత్యకేసులో త్వరలోనే కీలక పరిణామాలు ఉంటాయనే ఆయన ఈ కేసును ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివేకా కూతురు వైఎస్ సునీత స్వయంగా చంద్రబాబును కలిసి ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ కొనసాగేలా, అసలు దోషులకు శిక్ష పడేలా చూడాలని కోరారు. దీనికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు.
ఈ నేపథ్యంలో ఈ కేసు కీలక దశకు చేరుకోవడంతోనే వివేకా హత్యకేసును మహానాడులో చంద్రబాబు ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. అలాగే, ఏపీ లిక్కర్ స్కామ్ లో కూడా దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసులో జగన్ పాత్రకు సంబంధించి ఇప్పటికే కీలక సమాచారం సిట్ సేకరించిందని, దాంతో ఆయనను త్వరలోనే అరెస్ట్ చేయవచ్చుననే ప్రచారం జోరుగా జరుగుతోంది. అన్నాదమ్ములకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు కీలక దశకు చేరుకోవడంతో కడప వేదికగా జరుగుతోన్న మహానాడులో చంద్రబాబు ఈ ఇద్దరిని దృష్టిలో ఉంచుకొనే అవినీతి సొమ్మును కక్కిస్తాం.. నేరస్తులను ఉపేక్షించం అని కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఏదీ ఏమైనా, చంద్రబాబు వరుసగా చేస్తున్న ఈ వ్యాఖ్యలను చూస్తుంటే.. వెనువెంటనే అన్నాదమ్ములు జైలుకు వెళ్లే అవకాశం ఉందని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.