రియల్ ఎస్టేట్లో మోసగాళ్లు ఎన్ని విధాలుగా మోసం చేస్తున్నా..మోసపోయేవారు ఉంటూనే ఉన్నారు. ప్రీలాంచ్ పేరుతో ఇప్పటి వరకూ దోచుకున్నారు. ఆ దోపిడీ సాగుతూండగానే బై బ్యాక్ పేరుతోనూ పెద్ద ఎత్తున దోచుకున్న వైనం బయటపడింది.
హైదరాబాద్లోని మాదాపూర్లో ఏవీ ఇన్ఫ్రా అనే సంస్థ బై బ్యాక్ పథకం పేరుతో సుమారు రూ. 500 కోట్లు వసూలు చేసి జెండా ఎత్తేసింది. విజయ్ గోగుల అనే వ్యక్తి పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు, పెట్టుబడి పెడితే 18 నెలల్లో 50 శాతం అదనపు లాభం లేదా రెట్టింపు మొత్తం ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారు. ఒకవేళ డబ్బు తిరిగి ఇవ్వలేకపోతే, నారాయణఖేడ్, యాదగిరిగుట్ట వంటి చోట్ల వేసిన వెంచర్లలో భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని నమ్మబలికారు. ఈ హామీలతో భారీ మొత్తంలో డబ్బును వసూలు చేశారు.
గడువు ముగిసిన తర్వాత ముందుగా చెప్పినట్లుగా లాభాలు లేదా స్థలాలు ఇవ్వాలని అడిగినప్పుడు బెదిరింపులకు దిగారు. దీంతో వారు పోలీసుల్ని ఆశ్రయించారు.
సైబరాబాద్ పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ప్రీ లాంచ్ పేరుతో పెద్ద ఎత్తున ప్రజలు డబ్బులు పెట్టి మోసపోయారు. వేల కోట్లు మోసగాళ్ల అకౌంట్లలో పడ్డాయి. ఇప్పుడు బై బ్యాక్ పేరుతో అదే తరహా మోసం చేస్తున్నారు. ఇప్పుడు నిందితుల్ని అరెస్టు చేసినా డబ్బులు వస్తాయన్న గ్యారంటీ ఉండదు.