రాజకీయాలంటే ప్రత్యర్థులందర్నీ బలహీనం చేయడం కాదు. ప్రత్యర్థిని బలహీనపరిచేలా ఇతరుల్ని బలపర్చడం కూడా రాజకీయమే. కాంగ్రె్స పార్టీ ఇప్పుడు అదే చేస్తోంది. తమపై కవిత విమర్శలు చేస్తున్నప్పటికీ ఆమె రాజకీయంగా బలోపేతం కావడానికి తమ పరోక్షంగా సాయం చేస్తోంది. కవిత తన రాజకీయ అంశాలుగా తీసుకున్న వాటి విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పందిస్తోంది. దీంతో కవిత… జాగృతి పోరాటఫలం అని ప్రచారం చేసుకుంటున్నారు.
పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఏపీలో కలిపిన మండలాల్లో ఐదు గ్రామాలపై ప్రత్యేకమైన వివాదం ఉంది. ముంపు గ్రామాలు కాకపోయినప్పటికీ ఏపీలో కలిపారని దాని వల్ల సమస్యలు వస్తున్నాయని.. అక్కడి ప్రజలు అంటున్నారు. ఆ ఐదు గ్రామాల్ని తమకు ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఆ అంశం ఉంది. రేవంత్ రెడ్డి కూడా ఆ ఐదు గ్రామాల్లో తెలంగాణలో కలిపే ప్రయత్నం చేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వానికి గతంలో ఓ సారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదన కూడా పెట్టింది.
ఇప్పుడు కవిత ఇదే అంశంపై స్పందిస్తున్నారు. గతంలో ఏడు మండలాలను తిరిగి ఇవ్వాలని అనేవారు. అది మరీ అతి అవుతుందని అనుకున్నారేమో కానీ ఐదు గ్రామాలను మాత్రమే కలపాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కేంద్రానికి ఓ లేఖ రాశారు. ఆ లేఖను చూపించి..చూశారా జాగృతి పోరాటంతోనే ప్రభుత్వం కదిలింది అని కవిత ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి కోపరేషన్ ఉంటే చాలా.. ఇట్టే బలపడిపోతానని కవిత కూడా సంతృప్తి పడే అవకాశం ఉంది.