అమెరికా అధ్యక్షుడు అనే పదవికి ట్రంప్ ఎంత ఘోరంగా ఇజ్జత్ తీయాలో అంతగా తీస్తున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపేశానంటూ ప్రగల్భాలు పలికిన ఆయన ఇప్పుడు మరోసారి యుద్ధం ఆపేసినట్లుగా ప్రకటించారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగిపోయిందని…వారి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ట్రంప్ ప్రకటించేశారు. అయితే అసలు యుద్ధంలో పాల్గొన్న దేశాలు మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. పైగా ఎలాంటి ఒప్పందం జరగలేదని ఇరాన్ చెబుతోంది. ఎవరికి వారు దాడులు చేసుకుంటున్నారు.
రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాలని అనుకుంటే అమెరికా ఆ పని మొదట్లోనే చేసి ఉండేది. కానీ ట్రంప్.. ఇరాన్ పై ఇజ్రాయెల్ వేస్తున్న మిస్సైళ్లకు.. తాము కూడా తోడయ్యారు. అణు కేంద్రాలపై దాడులు చేశారు. దాంతో ఇరాన్ అమెరికానూ టార్గెట్ చేసుకుంది. ఖతార్ లోని ఆ దేశ వైమానిక స్థావరంపై దాడులు చేసింది. ఖతార్ కూడా ఇప్పుడు యుద్ధంలోకి దిగక తప్పని పరిస్థితి ఏర్పడింది.ప్రతీకారం ఖాయమని ఖతార్ కూడా తెలిపింది. ఇలా యుద్ధ విస్తరణ జరుగుతోంది కానీ.. తగ్గడం లేదు.
యుద్ధం ఆపాలని అనుకుంటే ముందు ఆ రెండుదేశాలు ప్రకటనలు చేయాలి. అది పద్దతి . కానీ అమెరికా అధ్యక్షుడు యుద్ధం ముగిసిందని సొంతంగా ప్రకటించడం..ఆయన తొందరపాటు తనానికి నిదర్శనం. నోబెల్ బహుమతి పిచ్చితో.. యుద్దాలకు కారణం అయి.. వాటిని తానే ఆపుతున్నట్లుగా ట్రంప్ ప్రకటనలు చేస్తున్నారు. ఆయన తీరుతో అమెరికా పరువు పోతోంది. ఇజ్రాయెల్, ఇరాన్ ఇప్పుడు కాల్పుల విరమణ ప్రకటించడం చిన్న విషయం కాదు. ఆ రెండు దేశాల మధ్య ఎన్నో అంశాలపై క్లారిటీ వస్తేనే సాధ్యమవుతుంది. అయితే ఇప్పటికే ఆ రెండుదేశాలు.. ప్రాణ, ఆస్తి నష్టాలను భారీగా చూశాయి. ఇంకా కొనసాగిస్తే వినాశనమే జరుగుతుంది.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ప్రపంచం మొత్తం అనిశ్చితంగా మారుతోంది. ఎక్కడెక్కడ సరిహద్దుల్లో ఉద్రిక్తంగా ఉన్న దేశాలన్నీ దాడులకు దిగుతున్నాయి. యుద్ధాలు చేసుకుంటున్నారు. దీనికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ట్రంపే కారణం అవుతున్నారు. మళ్లీ ఆయనే తానే ఆపేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు.