“ రాజకీయం బ్రహ్మరాక్షసి అయితే రాజకీయ నేతలు రాక్షసులు అవుతారు” . అందరూ కాకపోయినా కొంత మంది ఖచ్చితంగా రాక్షసులు ఉంటారు. అధికారం ఇచ్చిన ప్రజల మాన, ప్రాణాలను దోచుకుని రక్త, మాంసాలను కూడా వదలిపెట్టని రాక్షసులు ఉంటారు. అలాంటి వారి గుట్టు రట్టు కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఐదు సంవత్సరాల పాటు జరిగిన మద్యం కుంభకోణంలో ఎవరూ ఊహించని, అంచనా వేయలేని సంచలన విషయాలు వెలుగులోకి రాబోతున్నాయి. అందరూ లిక్కర్ స్కామ్ అంటే ఏదో మూడు వేల కోట్ల వ్యవహారం అనుకుంటున్నారు. కానీ అసలు ఓ ప్రభుత్వాన్ని దొంగలు, దోపిడీదారులు నడిపితే ఎంత ఘోరంగా ఉంటుందో ఈ స్కాం నిరూపిస్తోంది. మొత్తం వివరాలు బయటపడేనాటికి ఎవరూ ఊహించని విషయాలు వెలుగులోకి వస్తాయి.
ప్రజల రక్త, మాంసాలను పీల్చిన లిక్కర్ రాక్షసులు
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే పెద్ద మనిషి గురువారం హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి తనపై రూ.500 కోట్లు తరలించినట్లుగా కేసులు పెట్టబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీలో చాలా మంది నేతలు ఉన్నారు. వారందరిపై కాకుండా తనపైనే ఎందుకు పెట్టబోతున్నారో ఆయన చెప్పలేదు. ఎన్నికల సమయంలో హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లాకు తరలిస్తున్న రూ.8 కోట్ల నోట్ల కట్టలను పట్టుకున్నారు. వాటి గురించి ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ఖర్చుల కోసం డబ్బులన్నీ రాష్ట్రం నలుమూలలకు తరలించారన్నమాట. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?. అంత నగదు ఎక్కడి నుంచి వచ్చింది ?. ఇంకెక్కడి నుంచి వస్తుంది.. లిక్కర్ స్కామ్ నుంచే. లిక్కర్ దుకాణాల్లో ఎందుకు డిజిటల్ పేమెంట్స్ తీసుకోలేదో ఇలాంటివి నిరూపిస్తూ ఉంటాయి. తనపై లిక్కర్ కేసు పెట్టాలనుకుంటున్నారని అదే చెవిరెడ్డి చెప్పుకొచ్చారు. అంటే దొరికిపోయానని ఆయన చెబుతున్నారన్నమాట. చెవిరెడ్డి తరలించిన ఐదు వందలకోట్లు చాలా చిన్న మొత్తం. రాజ్ కెసిరెడ్డి దగ్గర నుంచి బాలాజీ గోవిందప్ప వరకూ తరలించిన సొమ్ములకు లెక్కలు బయటకు రావాల్సి ఉంది. ఇప్పటికే ఈడీ రాజ్ కెసిరెడ్డిని ప్రశ్నించింది. మొత్తం నగదు తరలింపు లావాదేవీలతో సహా రాజ్ కెసిరెడ్డిని ప్రశ్నించింది. ఆయన తప్పించుకోవడానికి అవకాశం లేని విధంగా ఈడీ బుక్ చేసిందని అంటున్నారు. ఇప్పుడు మిగిలిన విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. నిజానికి స్కామ్ ఎలా జరిగింది.. డబ్బులు ఎలా రూటింగ్ అయ్యాయన్నదానిపై పక్కా ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు వాటికి ఎక్స్ పోజ్ చేయడమే మిగిలి ఉంది.
ప్రభుత్వం పేరుతో అంతా వైసీపీ మాఫియా వ్యాపారం
లిక్కర్ స్కామ్లో ఎంత అవినీతి చేశారన్నది విషయం పక్కన పెడితే అసలు ఇలా ఎలా దోపిడీ చేయగలరని.. జరిగిన దోపిడీలో ఉన్న కోణాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. డిస్టిలరీలు లాక్కోవడం.. సొంత మద్యాన్ని అమ్మడం కాదు.. ఆ మద్యం వల్ల ప్రజల రక్త, మాంసాలు పీల్చినట్లు అవుతుందని తెలిసి కూడా వదిలి పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డికి బంపర్ మెజార్టీ కట్టబెట్టినది ఎవరు ?. ఆయన ఓటు బ్యాంక్ అయిన దళితులు, ముస్లింలు, నిరుపేదలు. వారి రక్త మాంసాలను జగన్ రెడ్డి మద్యం స్కాంతో పీల్చేశారు. తయారీకి పది రూపాయలు కూడా కాని చీప్ లిక్కర్ ను వందలకు అమ్మారు. రోజుకు వెయ్యి రూపాయలు కూలీ చేసి సంపాదించుకునేవారు.. జగన్ రెడ్డికి ఐదు వందల రూపాయల లిక్కర్ ట్యాక్స్ కట్టేవారు. మధ్యతరగతి ప్రజలు ఎంతగా చితికిపోయారో అర్థం చేసుకోవచ్చు. కేవలం అర్థిక పరంగానే కాదు.. పెద్ద ఎత్తున ఆనారోగ్యానికి గురయ్యారు. జే బ్రాండ్ల మద్యం తాగి కొన్ని వేల మంది లివర్ సమస్యలకు గురయ్యారని ఆస్పత్రుల రికార్డులు వెల్లడయ్యాయి. తనను నమ్మి ఓటేసిన వాళ్ల ఆరోగ్యాలను.. .ప్రాణాలను పణంగా పెట్టడం కన్నా రాక్షసత్వం ఏ రాజకీయనాయకుడి దగ్గర అయిన ఉంటుందా ?. కేవలం తన దోపిడి నిరాటంకంగా సాగడానికే ధరులు పెంచారు. తన హయాంలో మద్యం వినియోగం తగ్గిందని జగన్ రెడ్డి చెబుతూంటారు. అంత కంటే బూతు మరొకటి ఉండదు. వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని బెల్టు షాపుల ద్వారా లెక్కలోకి రాని మద్యం అమ్మించి సొమ్ము చేసుకున్నారు. అంటే ఆ లిక్కర్ అమ్మినట్లుగా లెక్కలోకి రాలేదు. అసలు సరఫరా అయినట్లుగా కూడా రికార్డుల్లోఉండదు. సీఐడీ అధికారులు డిస్టిలరీల్లో తనిఖీ చేసినప్పుడు ఇదంతా బయటపడింది. చేసిన ఉత్పత్తికి.. అమ్మకాలకు పొంతన ఏది అంటే వారి వద్ద సమాధానం లేదు. జే బ్రాండ్ లిక్కర్ పూర్తిగా ఫర్ సేల్ ఓన్లీ ఏపీ కేటగిరి. ఇతర రాష్ట్రాల్లో ఆ మద్యాన్ని అమ్మడానికి అనుమతులు ఇవ్వలేదు. మరి ఎక్కువగా ఉత్పత్తి చేసిన మద్యాన్ని ఎక్కడ అమ్మారు?. పన్నులు చెల్లించకుండా.. మద్యం దుకాణాల్లో..బెల్ట్ షాపుల్లో అమ్మేసి జేబుల్లో వేసుకున్నారు. ఇది పేదల కష్టాన్ని, రక్తాన్ని పీల్చిపిప్పి చేయడమే. చేసింది కాక.. తన హయాంలో లిక్కర్ సేల్స్ పడిపోయాయనని అయన చెప్పుకుంటూ ఉంటారు.
పాత్రధారులకు చిల్లర – సూత్రధారులకే అసలు కిక్కు
జగన్ రెడ్డి అతి తెలివికి నిదర్శనం.. మొత్తం ప్రభుత్వమే అమ్ముతూంటే అవినితి ఎక్కడి నుంచి వస్తుంది. ప్రైవేటు వ్యవహారం ఉన్నప్పుడే అవినీతి జరుగుతుందని లేకపోతే లేదని ఆయన ప్రజల్ని నమ్మిద్దామనుకుంటున్నారు. మొత్తం ప్రైవేటులో అయితే .. కమిషన్లు తీసుకుని వదిలేయాల్సి వచ్చేదమో కానీ.. జగన్ రెడ్డి ప్రభుత్వం అంటే తానేనని మొత్తం తన గుప్పిట్లో పెట్టుకున్నారు. కొంత మంది బకరాల్ని ముందు పెట్టి వారికి ఐదు పైసలో.. పది పైసలో ముఖానకొట్టి మిగతా మొత్తం దోచుకున్నారు. మద్యం తయారు చేసేది బినామీ కంపెనీలు.. రవాణా చేసేది బినామీ కంపెనీలు.. అమ్మేది వైన్ షాపుల్లో సూపర్ వైజర్లుగా ఉన్న వైసీపీ కార్యకర్తలు, లెక్కా పత్రం లేకుండా చూసుకునేది వైసీపీ నేతలు, డబ్బులు ఎక్కడికెక్కడికి చేర్చాలనేది ఓ ముఠా వ్యవహారం. అంతా పకడ్బందీగా నిర్వహించారని అనుకున్నారు. ఆధారాలు దొరకవని అనుకున్నారు. కానీ కళ్ల ముందుజరిగిన స్కామ్ లో ఆధారాలు లేవని .. తప్పించుకోవచ్చని ఎవరైనా అనుకుంటే అంత కంటే అమాయకులు ఉంటారా?. రాజ్ కెసిరెడ్డి కానీ.. విజయసాయిరెడ్డి కానీ మొత్తం గూడుపుఠాణి నడిపిన వారిలో కీలకం. విజయసాయిరెడ్డి మొత్తం రాజ్ కెసిరెడ్డి చేశారని చెబుతున్నారు కానీ జగన్ ఆయన వెనుక ఉన్నారని చెప్పడం లేదు. ఆయన చెప్పకపోయినా అందరూ అర్థం చేసుకుంటారు. రేపు విజయసాయిరెడ్డి తన మీదకు వస్తుందని అనుకుంటే.. సాక్ష్యాలతో సహా సీఐడీ ముందు పెట్టే అవకాశం ఉంది. అకౌంట్స్ గురించి తనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు కాబట్టి.. .ఈడీకి ఆ వివరాలు కూడా చెప్పే అవకాశం ఉంది. ఈ విషయంలో విజయసాయిరెడ్డి లిక్కర్ రాక్షసుల్లో ఒకరు అయినప్రటికీ ఆయన మాత్రం కావాలంటే నిజాలు చెప్పి అయినా బయటపడాలని అనుకుంటున్నారు. జగన్ రెడ్డి గురించి ఇప్పటి వరకూ ఆయన చెప్పకపోవచ్చు కానీ.. రాజ్ కెసిరెడ్డి స్కాం చేయడం అసాధ్యం. మొత్తం జగన్ రెడ్డి కనుసన్నల్లో రాజ్ కసిరెడ్డి ఇతరులు చేశారు. ఆ వివరాలు కూడా బయటకు వచ్చే సమయం ఆసన్నమయింది.
జగనూ దొరికిపోతాడని చెబుతున్న సజ్జల
పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగిన చందంగా..తాము ఎక్కడా రికార్డుల్లోకి ఎక్కకుండా పూర్తిగా నగదు లావాదేవీలతోనే దోపిడీ చేశామని ఆధారాలు అనేవే ఉండవని జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ అనుకుంటున్నారు. కానీ ఆధునిక ప్రపంచంలో ఇలాంటి వింత దొంగలకు.. సరైన బుద్ది చెప్పే టెక్నాలజీ వచ్చింది. తప్పు చేసిన వాళ్లు వంద శాతం ఫూల్ ఫ్రూఫ్తో తప్పులు చేయరు. ఎక్కడో ఓ చోట క్లూ ఇచ్చి దొరికిపోవాల్సిందే. లిక్కర్ స్కామ్లో సీఐడీ, ఈడీ వద్ద కావాల్సినన్ని క్లూస్ ఉన్నాయి. వాటిని సరైన సమయంలో పాచికలుగా వాడటమే మిగిలింది. ఆ విషయంపై వైసీపీ పెద్దలకూ క్లారిటీ ఉంది. కేసులతో అరెస్టు అయి జైళ్లలో మగ్గుతున్న వారిని జగన్ రెడ్డి పరామర్శించడం లేదు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శిస్తున్నారు. అలా గుంటూరు జైలుకు వెళ్లి బయటకు వచ్చాక.. అక్రమ కేసులు పెడుతున్నారని..అవి జగన్ దగ్గరకూ వస్తాయేమో అని జైలు ముందే చెప్పుకొచ్చారు. ఆయన నోటి చలువ ఏమో కానీ.. జగన్ రెడ్డిపై చాలా గట్టిగానే కేసులు నమోదు కాబోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. తాము చేసిన దోపిడీలు , దొంగతనాలపై ఆధారాలన్నీ దొరికాయని అనుకున్న తర్వాతనే ఇలాంటి కబుర్లను సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతూ ఉంటారు. అంటే.. జగన్ రెడ్డి కూడా రెడీ అవుతున్నారన్నమాట.
భారత రాజకీయ పార్టీల్లో రాక్షసత్వానికి బ్రాండ్ వైసీపీ
భారత ప్రజాస్వామ్యంలో చాలా రాజకీయ పార్టీలు వచ్చాయి. కొన్నివేల మంది రాజకీయ నేతలు వచ్చారు. ముఖ్యమంత్రి స్థాయికి వెళ్లిన వాళ్లు వందల్లో ఉంటారు. అయితే దేశ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి ప్రజల రక్త, మాంసాలను పీల్చి ఉండరు. ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప. ఆ రక్త మాంసాలతో బినామీలతో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టించారు.. వందల కిలోల బంగారం కొనుగోలు చేశారు. ఆ బంగారం ఎక్కడ దాచిపెట్టినా బయటకు రాక మానందు. లిక్కర్ స్కాంలో అసలు కుట్ర గురించి బయటకు వచ్చిన రోజున..దొంగలు దాచి పెట్టిన బంగారం, నోట్ల కట్టలన్నీ బయటకు వస్తాయి. ఎప్పటకీ దొరకబోమని వారనుకుంటే.. వారి కంటే అమాయకులు ఉండరు. గతంలో చెప్పుకున్నట్లుగా ఆయన 2019 ఎన్నికల్లో గెలవడం.. గెలుపుకాదు ఓడిపోవడం. ఆ గెలుపు వల్లనే జగన్ రెడ్డి తన అక్రమాస్తులు తప్ప అన్నీ పోగొట్టుకున్నారు. తల్లి, చెల్లి దూరమయ్యారు. వివేకా హత్యకేసు ఎప్పుడు మెడకు చుట్టుకుంటుందో తెలియదు. పార్టీ నేతలూ లేరు. చివరికి విజయసాయిరెడ్డి కూడా దూరమయ్యారు. ఇంకెవరు మిగాలారయ్యా అంటే.. సజ్జల రామకృష్ణారెడ్డి. రేపు ఆయన కూడా కనిపించకుండా పోయినా ఆశ్చర్యం లేదు.
అందుకే ఓ కేబినెట్ మంత్రి.. అరెస్టు ఎందుకు చేయడం లేదని నేరుగా చంద్రబాబునే ప్రశ్నించారు. చంద్రబాబు పద్దతి..పద్దతి అని తనదైన వ్యూహం ప్రకారం చెప్పి ఉండవచ్చు కానీ.. సాక్ష్యాలు ఉంటే కటకటాల వెనక్కి పంపుతామని ప్రకటించారు. ఆ సాక్ష్యాలు దండిగా ఉన్నాయన్నది సంగతిని చంద్రబాబు దాచి పెట్టారు. కానీ బయట పెట్టాల్సిన వాళ్లు బయట పెడతారు. అప్పుడు మొత్తం లిక్కర్ స్కాం సహా అన్ని స్కాముల వివరాలు బయటకు వస్తాయి. లిక్కర్ రాక్షసుల అంతం చూసేందుకు ..సమయం దగ్గర పడినట్లుగా అవుతుంది.