“ ప్రపంచం మొత్తం జనాభాలో భారత్లో 18 శాతం మంది ఉన్నారు. కానీ నీటి వనరులు 4 శాతం మాత్రమే ఉన్నాయి”. ఇది అంకెలు చెప్పే నిజం. మరి అవసరాలు తీర్చుకోవాలంటే దేశ పాలకులు, రాష్ట్ర పాలకులు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఎవరికి వారు స్వార్థపూరితంగా వ్యవహరిస్తే ప్రజల మధ్య విద్వేషాలు పెరుగుతాయి. ఆ జలాలను ఉపయోగించి రాజకీయాలు చేస్తే.. రాష్ట్రాల మధ్య శత్రుత్వాలు ఏర్పడతాయి. దీని వల్ల ఆయా రాజకీయ పార్టీల రాజకీయ లక్ష్యాలను అందుకోవడానికి అవకాశం ఏర్పడుతుందేమో కానీ శాశ్వతంగా పరిష్కరించలేని ఓ సమస్యను సృష్టించినట్లు అవుతుంది. ప్రస్తుతం ఉన్న వివాదాలకు తోడు.. తెలుగు రాష్ట్రాల మధ్య బనకచర్ల ప్రాజెక్టు వివాదంపై రాజకీయం ప్రారంభమైంది. ఈ అంశంపై అసలు చెప్పే నిజాల కన్నా.. ప్రజల్ని రెచ్చగొట్టేందుకు బనకచర్ల పేరుతో ఇతర అంశాలను తెరపైకి తెచ్చి ఆ ప్రాజెక్టును బూచిగా చూపించడమే ఎక్కువగా జరుగుతోంది. మన సంపద దోచుకుంటున్నారని తెలంగాణ ప్రజల్ని అక్కడి రాజకీయం రెచ్చగొడుతూంటే.. మా ప్రాజెక్టు అడ్డుకుంటున్నారని ఏపీ ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది. అయితే ఇది ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. దీన్ని చినికి చినికి గాలివానగా చేసుకుంటే తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడే విద్వేషాన్ని ఆపడానికి దశాబ్దాల సమయం పడుతుంది. ఆ లోపు ఎంతో నష్టం జరిగిపోతుంది.
సముద్రంలో పోయే నీటిని మళ్లించేందుకే బనకచర్ల
ముందుగా చెప్పుకున్నట్లుగా భారత దేశ ప్రజల అవసరాలకు తగ్గట్లుగా నీటి వనరులు లేవు. ఉన్న నీటి వనరుల్ని పొదుపుగా వాడుకోవాలి. అందుకే అన్ని రాష్ట్రాలు ప్రాజెక్టుల్ని నిర్మించుకుంటున్నాయి. ఎగువలో ఉన్న రాష్ట్రాలు తమ భూభాగంలో పడిన వర్షాల నీటిని, ఎగువ నుంచి వచ్చే నీటి ఆపుకోవడానికి శక్తి మేర నిర్మాణాలు జరుపుకున్నాయి. జరుపుకుంటున్నాయి. దిగువ రాష్ట్రాలు పోరాడటంతోనే సరిపోతోంది. వారు చేయాలనుకున్నవి వారు చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో దిగువ రాష్ట్రంగా ఏపీ ఉండేది. ఆంద్రప్రదేశ్ కర్ణాటక, మహారాష్ట్ర కడుతున్న ప్రాజెక్టులపై ఎంత ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఫలితంగా కృష్ణ డెల్టాకు ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి. దిగువ రాష్ట్రంగా ఉమ్మడి ఏపీ ఏ ప్రాజెక్టులు కట్టుకున్నా ఎగువ రాష్ట్రాలకు అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే వారు ఆపుకోలేక వదిలేసిన నీటిని ఏపీ నిలబెట్టుకునేందుకు ప్రాజెక్టులు కట్టుకుంటుంది. దాని వల్ల ఆయా రాష్ట్రాలకు ఎలాంటి ప్రభావం ఉండదు. అయితే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక.. మళ్లీ ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రం అయింది. తెలంగాణ ఎగువ రాష్ట్రం అయింది. నీటి పంపకాల కోసం ఉమ్మడి రాష్ట్రంలో బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు జరిగింది. ఆ తర్వాత వచ్చిన బ్రజేశ్ ట్రిబ్యునల్ వచ్చాయి. రెండు ట్రిబ్యునళ్లు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్కు 800 టీఎంసీల కృష్ణా నికర జలాలని కేటాయించాయి. రాష్ట్రం విడిపోక ముందు ఇందులో 512 టీఎంసీలు ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు, 299 టీఎంసీలు తెలంగాణాలో ఉన్న ప్రాజెక్టులకు వినియోగంలో ఉండేవి. గోదావరి జలాలపై ట్రిబ్యునల్ అవార్డు మేరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్కు 1480 టీఎంసీలు వచ్చాయి. వీటి వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విస్పష్టమైన విభజన లేదు. తాత్కలిక నీటి కేటాయింపులతో రెండు నదీజలాల బోర్డులు ప్రస్తుతానికి నీళ్లు కేటాయిస్తున్నాయి. ఎవరు ఎన్ని వాడుకున్నా గోదావరికి వచ్చే వరద వచ్చినట్లుగా సముద్రంలోకి పోతోంది. అత్యంత దిగువ రాష్ట్రంగా ఉన్న ఏపీ అలా నీళ్లు వృధాగా పోవడాన్ని చూసి భరించలేకపోతోంది. ఆ నీటిని కరువు ప్రాంతమైన రాయలసీమకు తరలిస్తే కరువును తరిమేయవచ్చని అనుకుంటోంది. అందుకే బనకచర్ల నిర్మాణాన్ని ప్రతిపాదించింది.
తెలంగాణకు ఎలా నష్టం ?
భారతదేశానికి ఉన్న పరిమితమైన నీటి వనరులను అందరికీ అందేలా చూసేందుకు నదుల అనుసంధానం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అందులో భాగంగా గోదావరి – పెన్నా అనుసంధాన ప్రాజెక్టును కేంద్రం పరిశీలిస్తోంది. ఈ విషయంపై అవగాహన ఉన్న ఏపీ ప్రభుత్వం వెంటనే పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టును ప్రతిపాదించింది. సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి నది యొక్క వరద జలాలను ఉపయోగించుకోవడం ద్వారా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, జిల్లాలలో కరువు ప్రాంతాలకు సాగునీరు ,తాగునీరు అందించాలని అనుకుంటున్నారు. దీని ద్వారా గోదావరి నీటిని కృష్ణా, పెన్నా నదుల బేసిన్లకు మళ్లించి, రాష్ట్రంలోని రిజర్వాయర్లను అనుసంధానం చేయాలనుకుంటున్నారు. బనకచర్ల ప్రాజెక్టు మూడు దశలలో నిర్మాణానికి ప్లాన్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నుండి ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న పవిత్ర సంగమం వరకు 175 కి.మీ. దూరంలో నీటిని తరలిస్తారు. వైకుంఠపురం నుండి పల్నాడు లోని బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు నీటిని తరలించడం రెండో సెగ్మెంట్ బొల్లాపల్లి రిజర్వాయర్లో నీటిని నిల్వ చేస్తారు. బొల్లాపల్లి రిజర్వాయర్ నుండి బనకచర్ల రెగ్యులేటర్ వరకు నీరు తరలింపు మూడో సెగ్మెంట్. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్” అనే ప్రత్యేక సంస్థను 2025లో ఏర్పాటు చేసింది. చంద్రబాబు తెలంగాణలో ప్రాజెక్టు కడుతున్నారు అనగానే.. తెలంగాణలో రాజకీయం ప్రారంభమయింది. తెలంగాణ నీళ్లు దోచుకెళ్లడానికే కడుతున్నారని.. పాలకులు చూస్తూ ఉండిపోతున్నారని ఆరోపణలు ప్రారంభమయ్యాయి. ఇవి అంతకంతకూ పెరుగుతున్నాయి. మేధావులు, జలవనరుల నిపుణులు, ఉద్యమకారుల పేరుతో చాలా మంది తెరపైకి వచ్చి ఏపీ జలదోపిడి అంటున్నారు కానీ.. బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టమో చెప్పలేకపోతున్నారు.
గోదావరిపై ఎగువ రాష్ట్రంగా తెలంగాణకు హక్కులు
ఎగువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు గోదావరిపై హక్కులు ఉన్నాయి. ఏపీకి ఎన్ని ఉన్నాయో.. తెలంగాణకూ అన్ని ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అన్నారు. అది నిజమే.. బనకచర్ల ప్రాజెక్ట్ 1980 గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డు , ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 నిబంధనలను ఉల్లంఘిస్తుందని చెబుతున్నారు. ఎలా అంటే గోదావరి నీటి కేటాయింపుల్లో తెలంగాణకు 968 టీఎంసీల హక్కు ఉందని… ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీ అదనపు నీటిని తీసుకోవడం తెలంగాణ హక్కులను కాలరాస్తుందని అంటున్నారు. కానీ ఇక్కడ ఏపీ ప్రభుత్వం .. కాళేశ్వరం ద్వారా ఎన్ని కావాలంటే అన్ని గోదావరి నీళ్లు మళ్లించుకోవాలని ఆఫర్ ఇస్తోంది. దీనికి సమాధానం చెప్పలేని మేధావులు.. తెలంగాణలోని కృష్ణా బేసిన్లో రైతులకు నీటి కొరత ఏర్పడుతుందని అంటున్నారు. బనకచర్ల అనేది సముద్రంలోకి పోతున్న గోదావరి నీటిని కృష్ణానదిలోకి ఎత్తిపోసి.. రాయలసీమకు పంపుతారు. ఆ ఎత్తిపోసేది కూడా.. సముద్రంలోకి వెళ్లే దగ్గర.. తెలంగాణను దాటి వచ్చేసిన తర్వాత. ఎక్కడో చిట్టి చివర కృష్ణాలోకి గోదావరి నీటిని ఎత్తిపోయడం ద్వారా ఎగువన ఉన్న ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడుతుందన్నది ఆధారాలు లేని వాదన. కృష్ణా నీటి కేటాయింపుల్లో తెలంగాణకు 299 టీఎంసీలు ఏపీకి 512 టీఎంసీలు కేటాయించారు. ఇది తెలంగాణ ఆమోదంతోనే జరిగింది. తీసుకునేది కృష్ణా జలాలు కానప్పుడు ఈ కేటాయింపుల అంశాన్ని తీసుకు రావడం కూడా రాజకీయమే. గోదావరిపై ఎగువ రాష్ట్రంగా తెలంగాణకు హక్కులు ఉన్నాయి. కానీ ఆ నీటిని నిల్వ ఉంచుకోగలిగినంత ఉంచుకున్నప్పుడే .. వాడుకోగలిగినంత వాడుకోగలిగినప్పుడే ఉంటాయి. దిగువకు వదిలేసినా తర్వాత.. ఆ రాష్ట్రానికి హక్కులు ఎలా ఉంటాయి?. దిగువ రాష్ట్రంగా ఉన్న ఏపీ.. సముద్రంలోకి పోయే నీటిని ఎలా వాడుకున్నా.. తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదు. కానీ రాజకీయ పార్టీలు ఈ వాస్తవాన్ని ప్రజలకు చెప్పడం లేదు. రాజకీయం కోసం.. లేనిపోని వాదనలతో ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని వల్ల తెలంగాణ రాష్ట్రాల మధ్య జల శత్రుత్వం మరింత పెరిగే ప్రమాదం ఏర్పడుతుంది.
ఎగువ రాష్ట్రాల తీరుతోనే జల వివాదాలు
దేశంలో అనేక రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఉన్నాయి. అవన్నీ ఎగువ రాష్ట్రాల తీరుతోనే ఏర్పడుతున్నాయి. దిగువ రాష్ట్రం మా నీరు దోచుకుంటోందని ఒక్క ఎగువ రాష్ట్రం ఆరోపణలు చేయడం లేదు తెలంగాణ రాజకీయ నాయకులు తప్ప. కావేరీ నదీ జల వివాదం కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి మధ్య దశాబ్దాలుగా వివాదం ఉంది. దిగువ రాష్ట్రంగా ఉన్న తమిళనాడుపై ఎగువ రాష్ట్రాలపై నీరు విడుదల చేయడం లేదని ఆరోపణలు చేస్తుంది కానీ.. దిగువ రాష్ట్రంగా తమిళనాడు కావేరీ నీటిని సముద్రంలోకి పోతుంటే వాడుకుంటోందని.. ఆరోపించడం లేదు. ఉత్తరప్రదేశ్, హరియాణా, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలు యమునా నదీ జలాల పంపిణీ వివాదంలో ఉన్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలు నర్మదా నదీ జలాల పంపిణీలో ఆరోపణలు చేసుకుంటూ ఉంటాయి. ఆ ఆరోపణలు అన్నీ పైన ఉన్న రాష్ట్రాలు తమకు న్యాయబద్దమైన నీటి వాటాను ఇవ్వడం లేదని దిగువరాష్ట్రాలు ఆరోపించే అంశంపైనే ఉంటాయి కానీ దిగువకు వెళ్లిపోయిన నీటిని ఆ రాష్ట్రం తరలించుకుంటోందని కాదు. ఇలాంటి వివాదం ఒక్క తెలుగు రాష్ట్రాల మధ్యనే ఉంది.
రాజకీయ నేతలకు ప్రజల పట్ల బాధ్యత అవసరం !
రాజకీయ నేతలు తమ సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం జల వివాదాలు సృష్టిస్తూంటారు. ప్రజలను రెచ్చగొడుతూంటారు. వాస్తవాలు చెప్పడానికి సిద్ధంగా ఉండరు. బనకచర్ల విషయంలో అదే జరుగుతోంది. గోదావరిలో తెలంగాణకు ఉన్న కేటాయింపులకు అనుగుణంగా అనుమతి లేకపోయినా ప్రాజెక్టులు నిర్మించుకోవాలని చంద్రబాబు సూచిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం గోదావరిపైనే కాళేశ్వరం నిర్మించుకుంది. లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్ట్. అనుమతులు లేకపోయినా పూర్తి అయిపోయింది. ఇప్పుడు బ్యారేజీల్లో సమస్యలు వచ్చి ఉండవచ్చు కానీ.. వినియోగంలో ఉంది. అలాగే ఇంకా గోదావరి నీటిని తరలించుకోవడానికి మరో మెగా కాళేశ్వరం కట్టుకోవాలని ఏపీ ప్రభుత్వం తరపున అభ్యంతరం చెప్పబోమని ఏపీ సీఎం అంటున్నారు. ఎగువ రాష్ట్రానికి ఇది బంపరాఫర్ లాంటిదే. గోదావరికి వస్తున్న వరదలో అత్యధిక భాగం సముద్రం పాలవుతోందన్నది నిజం. ఆ నీటిని వాడుకుంటే ప్రజల అవసరాలు తీరుతాయన్నది నిజం. అది మొత్తం కాదు.. శక్తిమేర తరలించుకుంటే చాలు. తెలంగాణ ఆ పని కాళేశ్వరం ద్వారా చేసే ప్రయత్నం చేసింది. దీని ద్వారా ఏపీకి వచ్చే గోదావరి వరద తగ్గుతుంది. అభ్యంతరం ఏమైనా చెప్పాల్సి వస్తే ఏపీ చెప్పాలి. తెలంగాణ ఆపుకోగలిగినన్ని నీరు ఆపుకున్న తర్వాత దిగువకు వచ్చే నీటిని ఏపీ ఎలా తరలించుకున్నా తెలంగాణకు నష్టం ఉండదు. ఈ నిజాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెబితే.. జల ఖడ్గంతో రాజకీయాలు చేసి ప్రజా ప్రజా ప్రయోజనాల్ని సంహరించాలనుకునే రాజకీయ నేతల ఆట కట్టించవచ్చు.