ఎడిటర్స్ కామెంట్ : లగేరహో కేసీఆర్ !

రాజకీయాల్లో ఏదో విధంగా గడిపేద్దామనుకునేవారికి లాంగ్ కెరీర్ ఉండదు. రాజకీయం అంటే అదే శ్వాసగా బతికే వారు మాత్రం ఎక్కువ కాలం ఉంటారు. అలాంటి రాజకీయ నేతలు చాలా అరుదుగా ఉంటారు. ఇప్పటికి ఉన్న సీనియర్ నేతల్లో మోదీ, చంద్రబాబు, కేసీఆర్ , స్టాలిన్ , మమతా బెనర్జీ లాంటి అతి కొద్ది మంది నేతలే ఈ కోవలోకి వస్తారు. వీరిలో ఎవరు ఎక్కువ రాజకీయాన్ని శ్వాసిస్తారో వారిదే అంతిమ విజయం. ఇప్పటి వరకూ మోదీ ఈ రేసులో చాలా ముందున్నారు. ఆయనన చాలెంజ్ చేసేందుకు సమకాలికులు శక్తిని కూడదీసుకుంటున్నారు. చాలా మంది మిడిల్ డ్రాప్ అయిపోతున్నారు. కొంత మంది ఫెయిలైన ఫార్ములాల్లో ప్రయత్నిస్తున్నారు. కానీ అన్నింటినీ కాదని కేసీఆర్ సరికొత్త మార్గంలో మోదీని సవాల్ చేయాలని నిర్ణయించుకున్నారు. నేరుగా జాతీయ పార్టీ పెట్టి మోదీని ఢీ కొట్టాలనుకుంటున్నారు. ఆయన కాన్ఫిడెన్స్ లెవల్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయంటే.. మీలో చాలా మంది కేంద్రమంత్రులు కాబోతున్నారని సొంత పార్టీ నేతలకు భరోసా ఇచ్చేంత. ఇలా చాలా మందికి కామెడీ అనపించవచ్చు.. నవ్వుకోవచ్చు. కానీ కేసీఆర్ బ్యాక్ గ్రౌండ్ గురించి కాస్త తీరిగ్గా ఆలోచిస్తే నవ్విన నాపచేనే పండుతుందన్న సామెతను కేసీఆర్ నిజం చేసి చూపించారు. ఆయన భాషలో చెప్పాలంటే .. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం అసాధ్యమని నూటికి 99 శాతం తేలిగ్గా తీసుకున్నా.. ఎన్నో సార్లు అధ:పాతాళానికి పడిపోయినా ఫీనిక్స్‌లా లేచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనూ మోడీని అదే పద్దతిలో ఢీకొట్టాలనుకోవడం కూడా మొదట్లో కేసీఆర్ ఉద్యమం ప్రారంభించినప్పటి పరిస్థితే ఉండవచ్చు. కానీ ఎవరు చూశారు .. మోదీని నిజంగానే కేసీఆర్ దింపేస్తారేమో?. రాజకీయాలు ఇవాళ ఉన్నట్లుగా రేపు ఉండవు. డైనమిక్‌గా మారపోతూ ఉంటాయి. అంతే డైనమిక్‌గా ఎవరు అయితే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారో వారికే విజయం వరిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు.

ఎనిమిదేళ్లలో “తెలంగాణ మోడల్” అభివృద్ధి కేసీఆర్ బ్రాండ్ !

తెలంగాణలో తిరుగులేని నేతగా ఉన్న కేసీఆర్ రాజకీయాల్లో అపర చాణక్యుడు. ఆయన ప్రతీ అడుగులోనూ రాజకీయం ఉంటుంది. అది ప్రత్యర్థులకు అందని రాజకీయం. అందుకే తెలంగాణ రాష్ట్రాన్నిసాధించారు. ఇప్పుడు ఆయన జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయాలనుకుంటున్నారు. అయితే కేసీఆర్ కు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆయన ఓ ప్రాంతీయ పార్టీ నేత . అదీ కూడా ప్రాంతీయ ఉద్యమాన్ని నిర్వహించి అధికారంలోకి వచ్చిన నేత. తాను జాతీయ రాజకీయాలు.. అని అంటే కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ కేసీఆర్ అలా అనుకోవడం లేదు. తాను తెలంగాణ సాధించానని.. అంతే వేగంగా ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రజల బతుకులు మార్చేశానని .. దేశ ప్రజల బతుకులు కూడా మార్చేస్తానని ధీమాగా చెబుతున్నారు. ఆయన ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించిన విజయాల్ని దేశం ముందు పెడుతున్నారు. నిజానికి తెలంగాణ సాధించిన అభివృద్ధి అద్భుతం. ఈ విషయం తెలంగాణలో ఉండేవారికి తెలియదు. ఓ ఏడాది పాపను ఇప్పుడు చూసి.. మరో ఎనిమిదేళ్ల తర్వాత చూస్తే.. అరె అప్పుడే చాలా ఎదిగిపోయిందే అని అనుకుంటాం. ఎందుకంటే చిన్నప్పుడు చూసి మళ్లీ ఇప్పుడు చూడటం వల్ల ఆ ఫీలింగ్ కలుగుతుంది. అదే పాపని ఎనిమిదేళ్ల పాటు రోజూ చూస్తుంటే…ఆ ఫీలింగ్ రాదు. ప్రస్తుతం తెలంగాణ ప్రజల్లో ఆలాంటి భావనే ఉంటుంది. ఎనిమిదేళ్ల కిందటి హైదరాబాద్ నగరంతో పోలిస్తే ఇప్పుడు హైదరాబాద్ ఎంతో అభివృద్ది చెందింది. ఇంకా చెప్పాలంటే విదేశీ నగరాల లుక్స్ వచ్చాయి. మిషన్ భగీరథ.. కాకతీయ వంటి ప్రాజెక్టులతో ప్రజల కనీస అవసరాలు తీరాయి. ఎలా చూసినా ఎనిమిదేళ్ల కిందటితో పోలిస్తే తెలంగాణ అద్భుతమైన ప్రగతిని నమోదు చేసింది. ఈ ప్రగతి రోజూ చూస్తున్న వారికి మామూలేగా అనిపిస్తుంది. కానీ దే్శ ప్రజలకు అలా అనిపించదు. ఎందుకంటే.. వాళ్ల జీవితాలు ఎక్కడివక్కడే ఉంటున్నాయి. ఎనిమిదేళ్లు కాదు ఎనభై ఏళ్లుగా వారి బతుకుల్లో మార్పులు చాలా తక్కువగానే ఉంటున్నాయి. అందుకే కేసీఆర్ తాను చేసి చూపిస్తానని వారికి తెలంగాణ అభివృద్ధి నమూనాను వారి ముందు ఆవిష్కరిస్తున్నారు. ఇది ఖచ్చితంగా మంచి రాజకీయ వ్యూహమే.

ప్రాంతీయ పార్టీల కూటమితో కుస్తీ పట్టడం కన్నా సొంత పార్టీనే బెటరనుకుంటున్న కేసీఆర్

ప్రాంతీయ పార్టీ నేతగా తాను ఇతర పార్టీలతో కూటమి కట్టి మాత్రమే రాజకీయాలు చేయగలనని కేసీఆర్ అనుకున్నారు. కానీ తన ఆలోచనలను చివరికి తానే మార్చుకున్నారు. గత నాలుగైదేళ్లుగా కేసీఆర్ కూటమి కట్టడానికి చాలా రాష్ట్రాలు తిరిగారు. అన్ని ప్రాంతీయ పార్టీలది ఒక్కో రకం ఎజెండా. ఎవరికి వారు కేంద్రంలోని బీజేపీపై పోరాడేందుకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు పెట్టుకున్నారు. ఈ కారణంగా కూటమి ప్రయత్నాలు ఫలవంతం కాలేదు. కానీ కేసీఆర్ చివరి వరకూ ప్రయత్నించారు. ఇటీవల బీజేపీ నుంచి బయటకు వచ్చి.. ఆ పార్టీపై పోరాడాలని నిర్ణయించుకున్న నితీష్ కుమార్‌తోనూ ప్రయత్నించారు. అయితే మొదటి నుంచి ఇలాంటి కూటమి రాజకీయాలు సక్సెస్ కాకపోవడానికి ప్రధాన కారణం నాయకత్వ సమస్య. ఎవరో ఒకరు బలమైన నేతను ఎంచుకుని ఆయనను మోదీకి పోటీగా పెట్టి ..ప్రజలకు ప్రత్యామ్నాయాన్ని చూపించి.. తమ ప్రణాళికలు వెల్లడిస్తే ప్రజలు తమ నిర్ణయాన్ని వెలిబుచ్చేవారు. అయితే ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువ మందిలాటరీ వేసేవారే. తమ పార్టీకి నిర్ణయాత్మకమైన సీట్లు వస్తే.. ప్రధాని పదవి తమకే దక్కుతుందని ఆశపడేవాళ్లే. ఈ కారణంగానే ధర్డ్ ఫ్రంట్ కానీ.. కాంగ్రెస్ ఫ్రంట్ కానీ సక్సెస్ కావడం లేదు. ఈ పరిణామాలన్నీ గ్రహించిన తర్వాత కేసీఆర్ రాజకీయంగా .. కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలంటే.. ఈ కూటమి రాజకీయాలతో కుస్తీ పడటం కంటే.. తనదైన ప్రత్యేక పార్టీతో ముందుకెళ్లడం మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. మెల్లగా తన ఆలోచనలను .. ప్రజల్లోకి పంపుతున్నారు. ఇటీవల నిజామాబాద్ సభలో .. తాము వస్తాం.. దేశం అంతా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చేసిన ప్రకటనపై ఉత్తరాదిలోనూ విస్తృత చర్చ జరిగింది. కొన్ని బీజేపీ అనుకూల మీడియాలో కేసీఆర్ రైతుల్ని మభ్య పెడుతున్నారని పెద్ద పెద్ద కథనాలు ప్రసారం అయ్యాయి. అంటే కేసీఆర్ మాటలకు ఉత్తరాదిలోనూ మంచి పలుకుబడి వచ్చినట్లే. ఇది శుభారంభం అనుకోవచ్చు.

తెలంగాణ ప్రజల్ని ఏకం చేసినట్లుగా దేశంలోని రైతులందర్నీ ఏకం చేసే వ్యూహం

కేసీఆర్ రాజకీయ అపర చాణక్యుడని ముందు చెప్పుకున్నాం. ఎదో రాజకీయ పార్టీ పెట్టి మంచి చేస్తా.. ఉచిత విద్యుత్ ఇస్తానంటే ఎవరూ ఓట్లేయరని ఆయనకూ తెలుసు. రాజకీయాలంటే ఈక్వేషన్స్.. ఎమోషన్స్ మిశ్రమం. ఇప్పటి రాజకీయాలు మొత్తం వాటి మీదే ఆధారపడి ఉన్నాయి. ఇలాంటి ఈక్వేషన్స్.. ఎమోషన్స్‌తోనే కేసీఆర్ రాజకీయంగా యుద్ధం చేసి తెలంగాణ సాధించారు కాబట్టి అందులో ఆయనకు పీహెచ్‌డీ ఉన్నట్లే. ఇంత అనుభవం ఉన్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎలాంటి ఈక్వెషన్స్.. ఎమోషన్స్ చూసుకోకుండా వెళ్తారని అనుకోలేం. కులాన్ని వాడలేరు. ఎందుకంటే దేశం మొత్తం ఒకే కులం వర్కవుట్ కాదు. మతం అనేది బీజేపీ సొంతం. ఆ పేరుతో ఏం చేసినా బీజేపీకే లాభిస్తుంది. ఇక కేసీఆర్ కు అచ్చి వచ్చిన ప్రాంతం సెంటిమెంట్ కూడా బీజేపీదే. భారత్ .. దేశభక్తి ని బీజేపీ పేటెంట్‌గా చేసుకుంది. మరి భారతీయులందర్నీ ఒకే తాటిపైకి తెచ్చే ఎమోషన్ ఏముంటుంది ?. దాన్నే కేసీఆర్ పట్టుకున్నారు. అదే రైతు ఎమోషన్. మోదీ సర్కార్ చేసిన తప్పులతో రైతులందర్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు … ఆయన గట్టి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అమలు చేస్తున్నారు కూడా. ఢిల్లీ రైతు ఉద్యమంలో చనిపోయిన వారికి పరిహారం ఇచ్చారు. తెలంగాణలో రైతులకు తాము చేస్తున్న మేలు గురించి పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తున్నారు. అదే సమయంలో అన్ని రాష్ట్రాల రైతు సంఘాల ప్రతినిధులను ప్రగతి భవన్‌కు పిలిపించి.. తెలంగాణలో రైతులకు చేస్తున్న మేలును వివరించారు. అందరం కలిసి రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని భరోసా ఇచ్చారు. కేసీఆర్ పిలుపు రైతు సంఘాల నేతల్ని ఆకర్షించింది. వారంతా….కేసీఆర్ నేతృత్వంలో రైతు పార్టీగా ఏర్పడి.. మోదీ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారని అనుకోవచ్చు. రైతు నేతలంతా చట్టసభల్లో ఉండాలని కేసీఆర్ అన్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో రైతు నేతలను ముందు పెట్టి.. రైతు సెంటిమెంట్‌తో.. రైతు పార్టీని కేసీఆర్ లాంఛ్ చేయబోతున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇది తెలివైన ఎత్తుగడ. ఎందుకంటే దేశంలో రైతులు.. రైతు బిడ్డలే ఉంటారు. ఇతరులు ఉండరు. వారిలో రైతు ప్రభుత్వం.. మన ప్రభుత్వం అనే ఎమోషన్ తీసుకు వస్తే కేసీఆర్ రాజకీయం చాలా సులువు అవుతుంది.

కేసీఆర్ పోరాడుతోంది మోదీతో – అలాగని ఓడిపోతారనేం లేదుగా !?

కేసీఆర్ ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేశారు. రైతు ఎజెండాతో మోడీని ఢీకొట్టడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన జాతీయ పార్టీని పెట్టవచ్చు. ఆ పార్టీని మరికొన్ని బలమైన పార్టీలతో కలుపుకుని పోరాడవచ్చు. ముందుగా చెప్పుకున్నట్లుగా రాజకీయాల్లో సమీకరణాలు కూడా ముఖ్యం. అన్నింటీనీ బ్యాలెన్స్ చేయగల సత్తా కేసీఆర్ సొంతం. అయితే కేసీఆర్ ఢీకొట్టబోతున్నది నరేంద్రమోదీని. ఇక్కడ అదే అసలు సవాల్. నరేంద్రమోదీ రాజకీయం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. అందుకే ఆయన ఒకప్పుడు అంటరాని నేతగా పేరుపడినప్పటికీ ఇప్పుడు పవర్ ఫుల్‌గా ఎదిగారు. ఇతరులెవరూ టచ్ చేయలేనంతగా ఇమేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ పోరాడుతోంది అలాంటి నేతతోనే. ఖచ్చితంగా ఈ పోరాటంలో అడ్వాంటేజ్ మోదీ వైపే ఉంటుందనడంలో సందేహం లేదు. కానీ కేసీఆర్ రాజకీయాలను మాత్రం తక్కువ అంచనా వేయలేం. తెలంగాణలో ఆయన రాజకీయాలను ఎలా అయినా నిర్వహించి ఉండవచ్చు.. జాతీయ స్థాయిలో మోదీ ఏం చేశారో.. తెలంగాణలో అదే చేశారని ఇద్దరికీ పెద్ద తేడా లేదని చాలా మంది విమర్శిస్తూ ఉండవచ్చు. కానీ అత్యంత బలవంతుడైన ప్రజాస్వామ్య రాజుకి అంతే బలవంతుడైన ప్రత్యర్థి ఉండటం కూడా ప్రజాస్వామ్యానికి ఎంతో ముఖ్యం. అలాంటి ప్రత్యర్థి తెలుగురాష్ట్రాల నుంచి వస్తే అంత కంటే మేలైన విషయం ఉండదు. నాయకత్వ లక్షణాల్లో తెలుగు వాళ్లు తీసేసిన వాళ్లు కాదని.. గుజరాతీల రాజకీయ వ్యూహాలను తిప్పికొట్టగలిగిన వారని నిరూపించగలిగే సామర్త్యం కేసీఆర్‌కు ఉంది. ఆ దిశగా ఆయన ప్రయత్నిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో గతంలో కేంద్ర ప్రభుత్వాల్ని మార్చగలిగేలా… ఏర్పాటు చేయగలిగేలా చక్రం తిప్పిన నేతలు ఉన్నారు కానీ… నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్నే లక్ష్యంగా చేసుకున్న తెలుగు నేతలెవరూ లేరు. ఆ విషయంలో కేసీఆర్ ముందున్నారు.

ప్రయత్నించకుండా ఓడిపోవడం కన్నా ప్రయత్నించి పరాజయం పాలవడం ఓ రకంగా విజయమే. ప్రయత్నించని వాడి కన్నా ప్రయత్నించిన వాడే అసలైన విజేత. కేసీఆర్ ఈ స్ఫూర్తితో రంగంలోకి దిగి మోదీతో పోటీ పడి దేశ ప్రజల మన్ననలు పొందకూడదని ఎక్కడా లేదు. ఏమో గుర్రం ఎగరా వచ్చు అని ఇక్కడ అదృష్టం గురించి చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే…ప్రజాస్వామ్యంలో గెలిచేది.. గెలిపించేది ప్రజలే. వారు ఎవరినైనా ఎన్నుకోవచ్చు. అందులో కేసీఆర్ ఉండకూడదనేమీ లేదు. అందుకే ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే.. లగేరహో కేసీఆర్!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close