ఈటల రాజేందర్ కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. ఆయన ఇచ్చే స్టేట్మెంట్ చాలా కీలకం. ముఖ్యంగా అంతా కేసీఆరే చేశారని ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు వాంగ్మూలాలు ఇచ్చారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈటల రాజేందర్ చెప్పే విషయాలు కీలకం. ఆయన కూడా కేసీఆరే అంతా చేశారని అంటే.. బీఆర్ఎస్ చీఫ్గా గడ్డు పరిస్థితులు ఎదురు కావొచ్చు.
కాళేశ్వరం రీ డిజైన్ సమయంలో ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రి. ఆయనే నిధుల విడుదలకు సంతకాలు చేశారు. నిజానికి కేసీఆర్ సీఎంగా ఉంటే.. మంత్రులకు చెప్పిన చోట సంతకాలు చేయడం తప్ప మరో స్వేచ్చ ఉండదని అంటారు. కానీ ఏం జరుగుతుందో విషయాలన్నీ తెలుస్తాయి. ఈటలకు ఇంకా బాగా తెలుస్తాయి. ఈ విషయాలు ఆయన కాళేశ్వరం కమిషన్ ముందు చెబుతారా లేదా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.
ఒకప్పుడు ఈటల రాజేందర్, కేసీఆర్ సన్నిహితులు. కానీ తర్వాత ఈటల రాజేందర్ ను పార్టీ నుంచి పంపడానికి కేసీఆర్ చాలా కుట్రలు చేశారు. తప్పుడు ప్రచారాలు చేయించి.. ఎస్సీల భూముల్ని కబ్జా చేశాడని నిందలు వేయించారు. చాలా ఆరోపణలు చేశారు. చివరికి పార్టీ నుంచి బయటకు పంపారు. అతి కష్టం మీద ఈటల రాజేందర్ .. తన రాజకీయ భవిష్యత్ను కాపాడుకున్నారు. ఆ కోపం ఇంకా మనసులో ఉంటే మాత్రం కేసీఆర్ గురించి కీలక విషయాలు చెబుతారని.. లేకపోతే తాను కూడా ఇరుక్కుంటానని ఫీలయితే మాత్రం.. అంతా నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ కు వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇచ్చినట్లుగా బయట ప్రచారం జరగకపోతే ఆయనకు సమస్యలు రావొచ్చు.