పాపం.. కమల్ హాసన్. ఈమధ్య ఆయనకు ఏదీ కలసి రావడం లేదు. `భారతీయుడు` తరవాత 30 ఏళ్ల గ్యాప్ తీసుకొని, శంకర్ తో `భారతీయుడు 2` తీస్తే అది డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమాకు జరిగిన ట్రోలింగ్… ఇదివరకెప్పుడూ జరగలేదు. ఆ చేదు జ్ఞాపకాల్లో ఉండగానే కమల్ నుంచి మరో కళాఖండం వచ్చింది. అదే `థగ్ లైఫ్`. ఈసారి కమల్కి ఫ్లాప్ ఇచ్చింది ఎవరో కాదు మణిరత్నం. ‘నాయకుడు’ తరవాత 38 ఏళ్లకు వీళ్ల కాంబోలో రూపుదిద్దుకొన్న సినిమా ఇది. ఈసారి ఎలాంటి అద్భుతం ఇస్తారో అని ఎదురు చూసిన ఫ్యాన్స్ తలబొప్పి కట్టేలా ఓ సినిమా తీశారు. గురువారం విడుదలైన ఈ సినిమా ప్రపంచమంతటా ‘ఫ్లాప్’ టాక్ మూటగట్టుకొంది. బుక్ మై షోలో.. అత్యల్ప రేటింగ్ అందుకొన్న ఘనత కూడా దీనిదే. కమల్ కల్ట్ ఫ్యాన్స్, మణిరత్నం వీరాభిమానులు సైతం ‘ఇదేం సినిమారా బాబోయ్’ అంటూ తలలు పట్టుకొంటున్నారు.
ఈ సినిమా విషయంలో మణిరత్నంని పూర్తిగా నిందించాల్సిన పనిలేదు. ఎందుకంటే స్క్రిప్టు విషయంలో కమల్ పాత్ర కూడా ఉంది. ఆయన స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేశారు. నిర్మాత కూడా ఆయనే. ఇలాంటి కథ ఎంచుకోవడం, కథనంలో వేలు పెట్టడం కమల్ చేసిన తప్పు. పైగా 38 ఏళ్ల తరవాత చేస్తున్న సినిమా అంటూ ప్రచారం జరిగేసరికి అంచనాలు పెరిగాయి. ఫ్యాన్స్ ఏదేదో ఊహించుకొన్నారు. ఆ అంచనాలే ఇప్పుడు కొంప ముంచాయి. మణిరత్నం పబ్లిసిటీకి దూరంగా ఉంటారు. అలాంటి ఆయన కూడా ఈ సినిమా కోసం బాగానే ప్రచారం చేశారు. దేశమంతా తిరిగారు. కమల్ తెలుగు మీడియాని సైతం చెన్నై పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇంత ప్రచారం చేసినా తెలుగులో సరైన ఓపెనింగ్స్ తీసుకోలేకపోయింది ఈ సినిమా.
క్రాఫ్ట్ పరంగా మణిరత్నం ఇప్పటికీ పర్ఫెక్ట్ గానే ఉన్నారు. ఆయన డిటైలింగ్ ఈ సినిమాలోనూ బాగుంది. కాకపోతే కథ, కథనం విషయంలో తేలిపోయారు. ఈ జనరేషన్కి ఏం కావాలి? అనే విషయం గుర్తించలేకపోయారు. అప్పుడు శంకర్ అదే చేశాడు. ఇప్పుడు మణిరత్నం కూడా అక్కడే దొరికిపోయారు. మణి అభిమానులు ఈ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ‘మణిసార్ ఇక రిటైర్ అయిపోవడం మంచిది’ అంటూ కామెంట్ చేస్తున్నారు. వాళ్లని అంతలా బాధించింది ఈ ప్రొడెక్ట్.