ఆంధ్రాలో రాబోయే ఆరు నెలల్లో భాజపాకి మహర్దశ రాబోతోందని ఆ పార్టీ నేత జీవీఎల్ నర్సింహారావు జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఆయన కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఛానెల్ కి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ… కొన్ని అంశాలపై అసమగ్రంగా మాట్లాడరని చెప్పాలి! రూ. 5 వేల కోట్ల నేషనల్ హెరాల్డ్ కేసులో ఇరుక్కున్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ బెయిల్ మీద తిరుగుతున్నారన్నారు. ఎడ్యూరప్పపై ఏ అభియోగాలు లేవన్నారు. ఆయనపై 23 కేసులు నమోదైనా, అవన్నీ కోర్టులో కొట్టివేశారన్నారు. అయితే, కర్ణాటక ముఖ్యమంత్రితో సహా చాలామందిపై అనేక ఆరోపణలున్నాయనీ, వాటిపై సరైన దర్యాప్తు జరగడం లేదని జీవీఎల్ చెప్పడం జరిగింది..! రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక వీరందరిపైనా విచారణ జరుగుతుందన్నారు. సిద్ధరామయ్య రూ. 2 లక్షల వాచీ కట్టుకుని తిరుగుతున్నారని ఆరోపించారు.
ఎడ్యూరప్ప జైలుకి వెళ్లొచ్చినంత మాత్రాన అవినీతిపరుడు అయిపోతారా అంటూనే… రాహుల్ గాంధీ జైలుకెళ్లొస్తే ఆయన అవినీతిపరుడు అని నమ్మేస్తారా అంటూ ఓ పోలిక చెప్పారు! అంటే, ఎడ్యూరప్పపై అవినీతి అంటే కేవలం ఆరోపణలన్నమాట! ఈ థియరీ ప్రకారం రాహుల్ బెయిల్ పొందిన కేసు కూడా ఎడ్యూరప్ప తరహాలోనే కొట్టేసే అవకాశం ఉన్నట్టు జీవీఎల్ ఒప్పుకున్నట్టా..? గాలి సోదరులను వెనకేసుకొస్తూ… వారు పార్టీలో మొదట్నుంచీ ఉన్నవారేననీ, వారు వేరే పార్టీల నుంచి వచ్చినవారు కాదని జీవీఎల్ విశ్లేషించారు. అంటే, మొదట్నుంచీ ఉన్నవారు అవినీతి చేసినా భాజపా క్షమించేస్తుందని జీవీఎల్ చెబుతున్నారా..? ఇక, కర్ణాటక ఎన్నికల్లో తెలుగువారి పరిపూర్ణ మద్దతు తమకే ఉందనీ, తాను చాలా ప్రాంతాలు పర్యటించి స్వయంగా చూసి వచ్చానని అన్నారు! తెలుగువారు ఎక్కువగా ఉండే బళ్లారిలో ప్రధాని సభ పెడితే తండోపతండాలుగా జనాలు వచ్చారనీ, అదే తిరుపతిలో చంద్రబాబు సభ పెడితే అంతమంది రాలేదని గమనించాలన్నారు. మోడీది ఎన్నికల ప్రచార సభ, చంద్రబాబుది ధర్మపోరాట సభ. అది కర్ణాటకలో జరిగింది, ఇది ఆంధ్రాలో జరిగింది. ఈ రెంటికీ పోలికేంటో జీవీఎల్ కే అర్థం కావాలి..?
ఇక, సిద్ధరామయ్య రూ. 2 లక్షల రిస్ట్ వాచీ పెట్టుకున్నారని ఆరోపించారే.. ఈ మాట అనగానే ప్రధాని నరేంద్ర మోడీ ధరించే దుస్తులు, డ్రెస్ ఛేంజింగుల ఖర్చుపై చాలా విమర్శలు ప్రజలకు గుర్తొస్తాయని జీవీఎల్ కి తెలిసి ఉండకపోవచ్చు. ఆంధ్రాకి భాజపా న్యాయం చేసిందని, కర్ణాటకలో తెలుగువారు సంతృప్తిగా ఉన్నారని జీవీఎల్ చెప్పడం మరీ విడ్డూరం. మొదట, ఈయనకి తెలుగువారు మనోభావాలు అర్థమయ్యే అవకాశం, అంచనా వేసే అనుభవం లేదు. కానీ, కర్ణాకటలో ఉండేవారి మనోభావాలు ఈయనకి తెలిసిపోయాయంటే.. చాలా విచిత్రంగా అనిపిస్తోంది.