తెలంగాణలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఏడాదిన్నర అయిపోయింది. ఇప్పటికి కసరత్తు చేసి చేసి చివరికి మూడు మంత్రి పదవుల్ని భర్తీ చేయాలని నిర్ణియంచారు. ఎస్సీ, బీసీలకు ఈ పదవులు ఇస్తున్నారు. మాల వర్గం నుంచి వివేక్, మాదిగ వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్, బీసీ నుంచి వాకిటి శ్రీహరిలకు చాన్స్ ఇస్తున్నారు. మరి మూడు పదవుల్ని ఎందుకు ఖాళీగా పెడుతున్నారు. పార్టీ నేతల హెచ్చరికల్ని , బెదిరింపుల్ని తట్టుకోలేక పక్కన పెడుతున్నారు.
పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశాలు ఇవ్వలేకపోతున్నారు. మూడు మంత్రి పదవుల్ని ఎందుకు భర్తీ చేయడం లేదంటే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారి బెదిరింపులకు తలొగ్గి. ఆయనకు ఇవ్వలేరు.. అలాగని ఇతరులకు ఇవ్వలేరు. అందుకే ఆపేశారు. ఈ రాజగోపాల్ రెడ్డి ఎవరు ..?. కాంగ్రెస్ పార్టీని ఎంతగా భ్రష్టుపట్టించాలో పట్టించారు. చివరికి పీక నొక్కేయడానికి మునుగోడు ఉపఎన్నిక తెచ్చారు. కానీ మళ్లీ కాంగ్రెస్ గెలుస్తుందన్న ఫీలింగ్ వచ్చాక మళ్లీ పార్టీలో చేరారు. ఇలాంటి వాళ్లకు కాంగ్రెస్ హైకమాండ్ భయపడుతోంది ?
పార్టీనే నమ్ముకుని ఉన్న వారు చాలా మంది ఉన్నారు. ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి వంటి వారికి పదవులు ఇవ్వడానికి ఈ రాజగోపాల్ రెడ్డి లాంటి వారి వారి బెదిరింపులు అడ్డం పడుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఇచ్చిన ధైర్యంతో మొదటి సారి ఎమ్మెల్యే అయిన ఇతరులు కూడా మంత్రి పదవులు ఇవ్వాలని లాబీయింగ్ చేసుకుంటున్నారు. బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఇంత బేలగా ఉంటే.. కోమటిరెడ్డి లాంటి నేతలు ఓ ఆట ఆడుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది.