బెంగళూరులో అద్దెల గురించి తరచూ సోషల్ మీడియాలో వైరల్ పోస్టులు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ డబుల్ బెడ్ రూం ఫ్లాట్ కు నలభై వేలు పెట్టాల్సి వస్తుందని.. ఇండిపెండెంట్ హౌసుల్లో అయితే కనీసం పాతిక వేలు తక్కువ తీసుకోరని చెబుతూంటారు. సింగిల్ బెడ్ రూంకు కనీసం ఇరవై వేలు అద్దె కట్టాలని ఇలా అయితే ఎలా బతుకుతామని నెటిజన్లు కొంత మంది ఆందోళన చెందుతూ ఉంటారు.
హైదరాబాదీలు గతంలో అయితే పాపం బెంగళూరు ప్రజలు అనుకునేవారేమో కానీ ఇప్పుడు మాత్రం.. ఇక్కడ మాత్రం ఏం తక్కువ ఉన్నాయని గొణుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ శివారిలోనే ఇప్పుడు డబుల్ బెడ్ రూం అపార్టుమెంట్ కు కనీసం ఇరవై వేలు పెట్టాల్సి వస్తోంది. కాస్త లగ్జరీ సౌకర్యాలు ఉన్న అపార్టుమెంట్ లో అయితే.. పాతిక వేలకుపైగా అద్దె చెబుతున్నారు. ఇక కాలనీల్లో ..కనీస సదుపాయాలు మాత్రమే ఉండి.. పార్కింగ్ కూడా ఉండని ఇళ్లల్లో అయితే కనీసం పదిహేను వేలు పెట్టాల్సి వస్తోంది. ఇది శివారు ప్రాంతాల్లోనే.
ఐటీ కారిడార్ కు దగ్గరగా అయితే కనీసం ముఫ్పై నుంచి నలభై వేల రూపాయలు అద్దె పెట్టుకోవాలి. కూకట్ పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో కాస్త తక్కువగా ఉంటుంది కానీ.., తక్కువేం కాదు. ఇటీవలి కాలంలో ఇళ్ల కొనుగోలు తగ్గిపోవడం, రేట్లు పెరిగిపోవడంతో ఎక్కువ మంది అద్దె ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉద్యోగాలు, ఉపాధి, చదువుల కోసం వచ్చే వారు పెరిగిపోవడంతో.. అద్దెఇళ్లకు డిమాండ్ కూడా పెరుగుతోంది.