నయనతారని ఓ సినిమాకు ఒప్పించడం సులభమే. కానీ ప్రమోషన్లకు మాత్రం తీసుకురాలేం. సినిమా ఒప్పుకొనేటప్పుడే నయన క్లియర్ గా చెప్పేస్తుంది. ‘నేను ప్రమోషన్లకు రాను..’ అని. ఎంత పెద్ద స్టార్ తో సినిమా చేసినా నయనది ఇదే థియరీ. దానికి ఒప్పుకొనే ఆమెతో సినిమాలు చేయడానికి సిద్ధపడతారు నిర్మాతలు.
అయితే చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా విషయంలో మాత్రం నయన తన రూల్స్ ని పక్కన పెట్టింది. ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. తనతో ఓ ప్రమోషనల్ వీడియో కూడా చేయించేశాడు. నయనలో ఇంత మార్పేంటి? తమిళ సినిమాలకు సైతం ప్రమోషన్లకు వెళ్లని నయన… ఓ ప్రమోషనల్ వీడియో చేయడం ఏమిటి? అని ఆశ్చర్యపోయారు. ఈ మార్పు వెనుక ఓ సీక్రెట్ వుంది. నయనకు ఈ సినిమా కోసం ఇచ్చే పారితోషికానికి అదనంగా మరో రూ.2 కోట్లు జోడించార్ట. అది కేవలం ప్రమోషన్స్ కోసం అని తెలుస్తోంది. ఆరెండు కోట్ల కోసం.. నయన ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి రెడీ అయ్యిందన్నమాట.
ఈ సినిమా మాత్రమే కాదు.. అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో ఓసినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఇందులో దీపికా పదుకొణె కథానాయిక. ఈ సినిమా ప్రమోషన్లకు దీపిక రానుంది. అందుకోసం పారితోషికానికి అదనంగా మరికొంత చెల్లించార్ట. ప్రమోషన్లకు సెపరేటు రెమ్యునరేషన్ ఇస్తే ఎంత పెద్ద స్టార్ అయినా సరే, తలాడించుకొంటూ ప్రమోషన్లలో కూర్చోవాల్సిందే. ఇదో కొత్త వ్యాపారంలా మారింది. మరి ఈ అదనపు ఖర్చుకు తగ్గట్టుగా ఈ కథానాయికల ప్రమోషన్ ఈవెంట్ల వల్ల రిటర్న్ వస్తాయా? అనేది ఆలోచించుకోవాల్సిన విషయం. కథానాయికల వల్ల ఈవెంట్స్ కు గ్లామర్ రావొచ్చు. కానీ ఆ ప్రమోషన్లు చూసి జనాలు థియేటర్లకు వస్తారా? వాళ్ల వల్ల ఎక్కువ టికెట్లు తెగుతాయా? అనేది మరో చర్చనీయాంశం.