ఎడిటర్స్ కామెంట్ : మన కనుపాపలను మనం ఎప్పటికి కాపాడుకోగలం ?

” పిల్లలూ దేవుడూ చల్లని వారే..కల్లా కపటం తెలియని వారే ” అంటాడు ఓ సినీ కవి. ఈ విషయం కవి చెప్పకపోయినా అందరికీ తెలుసు. పిల్లల్ని చూస్తే వారిలా మారిపోయి ఆడుకోవాలనుకుంటారు కానీ వారిని చెరబట్టాలనే ఆలోచన వస్తుందా..? వస్తే ప్రపంచంలోనే అతి భయంకరమైన మృగం ఆ ఆలోచన వచ్చిన వాడే అవుతాడు. హైదరాబాద్‌లోని సింగేణి కాలనీలో చిన్నారి చైత్ర అలాంటి మృగం బారిన పడింది. ప్రాణాలు కూడా కోల్పోయింది. ఎంతో భవిష్యత్ ఉన్న ఆ బిడ్డ ఆ మృగం బారిన పడి ప్రాణాలు కోల్పోయింది. ఆ ఘటనతో అందరికీ ఆవేశం వచ్చింది. ఎన్ కౌంటర్ చేయాలన్నారు. చంపేయాలన్నారు. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడో.. ఆత్మహత్య చేశారో క్లారిటీ లేదు. కానీ ఆ మృగం చచ్చిపోయింది.

ఎంత మంది నిర్భయలు బలైపోతున్న మార్పు రాదేం !?

చిన్నారులు, మహిళలకు ఇళ్లు,పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, రోడ్లు, రైళ్ళు, పనిప్రదేశాలు.. ఎక్కడా భద్రత లేకుండా పోయింది. గొంతు పిసికి, బ్లేడుతో చీల్చి, కత్తితో కోసి, గొడ్డలితో నరికి, చున్నీతో ఉరేసి, యాసిడ్‌ను కుమ్మరించి, పెట్రోల్‌ చల్లి తగలబెట్టడం వంటివి ఈ దుర్యోధన దుశ్యసన దుర్వినీతి లోకంలో రోజువారి సంఘటనలుగా మారిపోతున్నాయి. పాతికేళ్ల నాడుగుంటూరులో శ్రీలక్ష్మిని కాలేజీలోకి వెళ్లి వేట కత్తితో నరికేశాడు ఓ రాక్షసుడు. అప్పుడే రాష్ట్రం మొత్తం గగ్గోలు పెటటింది. ఆ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మరోటన్నారు.. మరోటన్నారు. కానీ ఇప్పటికీ ఆ నిందితుడికి శిక్ష పడిందా ..? అంటే దిక్కులు చూడాల్సిన పరిస్థితి. ఆ తర్వాత అలాంటి ఘోరాలు.. నేరాలు చిన్న పిల్లలపై ఆకృత్యాలు ఎన్ని వందలు జరిగాయో లెక్కలేదు. గత ఏడాది తిరుపతిలో ఓ కల్యాణమండపం పెళ్లి హడావుడిలో ఉంటే ముక్కుపచ్చలారని చిన్నారి జీవితాన్ని ఛిద్రం చేశాడో నీచుడు. వరంగల్లో తొమ్మిది నెలల పాపను కూడా వదిలి పెట్టలేదు. అనంతపురంలో.. గుంటూరులో.. నర్సరావుపేటలో.. విశాఖలో .. విజయవాడలో ఇలా వరుసగా అమ్మాయిల్ని అడ్డగోలుగా చంపేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. జనమంతా రోడ్లపైకి వచ్చి గగ్గోలు పెట్టినా .. నిర్భయ సంఘటన తర్వాత చట్టం వచ్చినా అత్యాచార పర్వం ఆగిందా? అంటే, లేదు. ఎందరో నిర్భయలు .. అభయలు బలవుతూనే ఉన్నారు. ఇలాంటి కేసులు రెట్టింపయ్యాయి. నిందితుల్ని పట్టుకుంటూనే ఉన్నారు. ఇలాంటి వారందరికీ శిక్షలు పడ్డాయా..?. యాసిడ్ దాడి చేశారని వరంగల్‌లో ఇద్దర్ని ఎన్ కౌంటర్ చేశారు. దిశ పై దారుణానికి ఒడిగట్టారని నలుగుర్ని కాల్చి చంపేశారు. అయినా నేరాలు తగ్గాయా..? దిశకు న్యాయం జరిగిందా..?. ఒక్క దిశకే కాదు అఘాయిత్యానికి బలైపోయిన ఏ దిశకూ న్యాయం జరగలేదు. నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన ఘటనల్లోనూ న్యాయం జరగలేదని.. అలాంటి ఘటనలు వరుసగా బయటపడుతూంటనే తెలిసిపోతుంది.

మృగాల్ని తయారు చేసుకుంటున్నది మనమే..!

యత్ర నార్యస్తు పూజ్యంతే
రమంతే తత్ర దేవతాః
ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు నివసిస్తారని అంటారు. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని గొప్పగా చెప్పుకుంటాం. కానీ, జరుగుతున్నదేమిటి? ఆమె శరీరంలోని ఎత్తు పల్లాల మాంసపు ముద్దల్నే తప్ప ఏమీ చూడడం లేదు..! పెరిగిపోయిన సాంకేతిక ప్రపంచం.. చెరిగిపోయిన సాంస్కృతిక హద్దులు ఈ దుర్భలత్వాన్ని సంక్రమింప చేస్తున్నాయి. ఏ సమాచార సాధనం చూసినా అత్యాచారాలు.. హత్యలే మొదటగా కనిపిస్తున్నాయి. అత్యాచారాలకు పాల్పడేది జులాయిగా తిరుగుతూ తాగి తందానలాడేవాళ్ళు మాత్రమే కాదు.. కంటికి రెప్పలా కాపాడాల్సిన వాళ్లు కూడా కాటేస్తున్నారు. ఇలాంటి వైపరీత్యాలు రోజు రోజుకీ పెరిగి పోవడానికి కారణం ఖచ్చితంగా మనమే. వాస్తవం మరచి మృగాలుగా, రాక్షసులుగా మారడానికి కారణం మనమే. వినోదం పేరుతో ఆకతాయి వేషాలు వేసి, అమ్మాయిల్ని ఏడిపించేవాల్లని హీరోలుగా చూపించే సినిమాలూ, మన ఇళ్ళలోకి చొచ్చుకొచ్చిన టివీల్లో చూపే అక్రమ సంబంధాల సీరియళ్ళు, క్రైం స్టోరిలు, మొబైల్ ఫోన్లలో విచ్చలవిడిగా అందుబాట్లోకి వచ్చిన అశ్లీల చిత్రాలు.. అంతా కారణమే.

విచ్చలవిడితనం పెరిగిపోతున్న వ్యవస్థలో చైతన్యం లేకపోవడమే సమస్య !

సమాజంలో మనుషుల్లో మృగాలు ఎందుకు తయారవుతాయంటే క్రమబద్దమైన జీవనం లేకపోవడం. అలా లేకపోవడానికి ప్రధాన కారణం వ్యవస్థలు సరిగ్గా పనిచేయకపోవడమే. ప్రతి వ్యవస్థ కనీసం తమ బాధ్యతల్లో సగం మాత్రమైనా నిజాయితీగా పని చేస్తూంటే ప్రజల్లో సమాజ పద్దతులకు కట్టుబడి బతకాలన్న ఆలోచన ఉంటుంది. ఉదాహరణకు న్యాయవ్యవస్థనే తీసుకుందాం.. ఆ వ్యవస్థ ఎంత మేర ప్రజలకు నమ్మకం కలిగిస్తోంది. దేశంలో ఉన్న వ్యవస్థల్లో న్యాయవ్యవస్థపైనే ప్రజలకు అంతో ఇంతో నమ్మకం ఉంది. కానీ కళ్ల ఎదుట జరిగిన నేరానికి.. పక్కా సాక్ష్యాలు ఉన్న నేరానికి శిక్ష వేయడానికి ఎంత కాలం పడుతుంది..? అసలు శిక్ష వేయకుండా వదిలేసి నఘటనలు కూడా లేవా..? ఇప్పుడు సందర్భం కాబట్టి చెప్పుకుంటున్నాం… మహిళలపై గత ఇరవై ఏళ్లుగా అఘాయిత్యాలకు పాల్పడిన సంచలనాత్మక కేసుల్లో ఎంత మందికి శిక్ష పడిందో ఎవరైనా చెప్పగలరా…? కనీసం నాలుగైదు కేసుల్లో అయినా శిక్ష పడిందో లేదో ఎవరికీ తెలియదు. అందుకే నేరం జరిగినప్పుడు నిందితుడికి ఇన్‌స్టంట్ శిక్ష వేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కానీ న్యాయస్థానాలకు అప్పగించాలని ఎవరూ చెప్పడం లేదు. అందుకే ఇతర వ్యవస్థలు చట్టాలను చేతుల్లోకి తీసుకుంటున్నాయి. ఇది ఏ మాత్రం ప్రమాణాలు పెరగడం కాదు. ఇంకా చెప్పాలంటే దిగజారిపోతున్నాం.

ఇన్‌స్టంట్ శిక్షలు .. ఎన్‌కౌంటర్లను కోరుకుంటున్న జనం !

ఉరిశిక్షలు, ఎన్‌కౌంటర్లే, ఆత్మహత్య శిక్షలు పరిష్కారం అయితే.. మరోసారి ఈ దారుణాలు చోటుచేసుకునేవి కావు. కానీ, ఇవి నిత్యకృత్యం అయ్యాయి అంటే చేయాల్సింది కొత్తకొత్త చట్టాలు కాదు. వ్యవస్థలో చైతన్యం కల్గించడం. అవగాహన కల్గించడం చేయాలి. ఆరు నెలల పసిగుడ్డు నుండి తొంభై ఏండ్ల వద్ధురాలి వరకు లైంగిక దాడులకు గురవుతుంటే.. మహిళలు ధరించే దుస్తులే ఈ లైంగిక దాడులకు కారణమనే వ్యక్తులు సమాజంలో ఉన్నంత కాలం మనమే నేరస్తులమవుతాం. వికృత పోకడలను ప్రోత్సహిస్తూ పరిణామాలకు మహిళలను బాధ్యులను చేస్తున్నంత కాలం మనదే తప్పవుతుంది. తప్పు ఎక్కడ ఉందో తెలుసుకోకుండా నిందితుడ్ని ఆవేశంగా శిక్షించడం చేస్తే అప్పటికి న్యాయం జరిగినట్లుగా ఉన్న మన ఆలోచనల్లో ఉన్న దివాలా తనమే ఈ సమాజానికి అసలైన శాపం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ప్రజలు ఏ శిక్ష లేకపోవడం కన్నా ఏదో ఓ శిక్ష త్వరగా పడాలని కోరుకుంటున్నారు.

చిన్నారి చైత్రకు న్యాయం జరగలేదు.. జరగాలంటే మన చేతుల్లోనే ఉంది..!

ఓ వైపు అత్యాచారాలు..నేరాలు ఆగడం మలేదు..మరో వైపు ఆటవిక న్యాయం చేయాలన్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఆ న్యాయాన్ని కొందరు చేసేస్తున్నారు కూడా. ఇదే పరిస్థితి రేపు అదుపు తప్పిదే ఎవరు బాధ్యత వహిస్తారు. అధికారంలో ఉన్న వాళ్లు వ్యవస్థలను ఎంత దారుణంగా తమ స్వార్థానికి వాడుకుంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రేపు ఇలాంటి అవకాశాల్ని మరో విధంగా వారు వాడుకోరన్న నమ్మకమూ లేదు. అంటే అంతిమంగా.. అటు బిడ్డల్ని కాపాడుకోవడం చేత కాలేదు.. భవిష్యత్‌లో కాపాడుకునే అవకాశాల్ని కూడా మనంచేజేతులా పోగొట్టుకుంటున్నాం. ఘటనలు జరిగినప్పుడు కొద్ది రోజులు సంచలన వార్తగా ఉండి ఆ తర్వాత పాతబడి అందరూ మరిచి పోయే సంఘటనగా మాత్రమే ఘాతుక చర్య ఎందుకు మిగిలిపోతోంది? ఎందుకని సమాజం బలంగా స్పందించడంలేదు?ఏవరు నేరస్తులు? అనేది మనందరం వేసుకొవాల్సిన ప్రశ్న. ఆరేళ్ల పాపను చిదిమేసిన మృగం చచ్చిపోయిందో .. చంపేశారో మరి ఇప్పుడు ఆ పాపకు న్యాయం జరిగినట్లా..? కానే కాదు. ఒక్క శాతం కూడా ఆ పాపకు న్యాయం జరిగినట్లుగా కాదు. న్యాయం జరగాలంటే సమాజంలోని ఆ మృగాళ్లు అంతమైపోవాలి. అలా జరగాలంటే అలాంటి మృగాళ్లు తరయారవ్వని సమాజం సృష్టించబడాలి. అది సాధ్యమేనా..? ఆ దిశగా అడుగులేస్తేనే చిన్నారి చైత్రకు కాస్తయినా న్యాయం చేసినట్లవుతుంది. అది మన చేతుల్లోనే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close