రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాక దాదాపు రెండు నెలలపాటు ఒక్క హోం మంత్రితోనే కాలక్షేపం చేశారు. ఆ తరువాత, కేబినెట్ విస్తరణ చేపట్టినా… అది కూడా పాక్షికంగానే ఉంది. ముఖ్యమంత్రితోపాటు 17 మందికి మంత్రి మండలిలో తీసుకునే అవకాశం ఉంది. కానీ, కేవలం 11తో సరిపెట్టుకున్నారు. అప్పట్నుంచీ మరో దఫా విస్తరణ ఉంటుందనే కథనాలు వస్తూ ఉన్నాయి. పార్లమెంటు, జిల్లా పరిషత్, స్థానిక సంస్థల ఎన్నికలు వరుస రావడంతో విస్తరణ జోలికి ముఖ్యమంత్రి పోలేదు. అయితే, ఒక్క మున్సిపల్ ఎన్నికలు తప్ప ఇప్పుడేమీ లేవు. దీంతో విస్తరణకు కావాల్సిన కసరత్తు మొదలైందనే సంకేతాలు ప్రగతి భవన్ వర్గాల్లో కనిపిస్తున్నాయి.
తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్, మరో కీలక నేత హరీష్ రావులను కేబినెట్ లోకి తీసుకోవడం ఖాయం అనే ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. అయితే, ఈ మధ్య కేటీఆర్ కి త్వరగా మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో వినిపిస్తోంది. ఆయన మంత్రి అయితేనే మరింతగా సేవ చేయగలరు అంటూ హోం మంత్రి మహమూద్ అలీ ఓ సభలో వ్యాఖ్యానించారు. గతవారం కూకట్ పల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాధవరం కృష్ణరావు మాట్లాడుతూ… కేటీఆర్ మంత్రిగా లేకపోవడం వల్ల కొంత ఇబ్బందిగా కాస్త బాధగా ఉందనీ, ఆయనకి కేబినెట్ లో చోటు కల్పించితే బాగుంటుందని బహిరంగంగానే అభిప్రాయపడ్డారు. ఇతర నేతలూ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ ని త్వరగా మంత్రి చేయాలనే డిమాండ్ ని తెరమీదికి తెస్తున్నారు.
ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే… కేబినెట్ విస్తరణ కేటీఆర్ కి పదవి కల్పించాలన్న కోణం నుంచి ఇప్పుడు మొదలుకావడం. గతంలో మంత్రిగా ఉండగా హైదరాబాద్ లో కేటీఆర్ చాలా యాక్టివ్ గా ఉండేవారు. కానీ, ఇప్పుడు పార్టీకి మాత్రమే పరిమితం అవుతున్నారు. గ్రేటర్ పరిధిలో ఈ మధ్య తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారనే ఫిర్యాదులు ఆ పార్టీకి చెందినవారే సీఎం దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో హైదరాబాద్ పరిధిలోనే బాగా వెనకబడింది. ప్రోటోకాల్ లేకపోవడం వల్ల అధికారిక కార్యక్రమాలకు కేటీఆర్ దూరంగా ఉండాల్సి వస్తోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని… కేటీఆర్ కి మంత్రి పదవి ఇస్తే… గతంలో మాదిరిగా అధికారిక కార్యక్రమాల్లో కీలకం కావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. కేటీఆర్ కేంద్రంగా కేబినెట్ విస్తరణ చర్చ ఇప్పుడు మొదలైంది. కేబినెట్ లో మరో ఆరుగురికి చోటుంది. మరి, త్వరలోనే భర్తీ చేసేస్తారో లేదో చూడాలి.