జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో రాజ్య భాషా విభాగ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హిందీ నేర్చుకోవడం గురించి మాట్లాడారు. హిందీ దేశాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. మాతృభాష అమ్మ అయితే.. హిందీ పెద్దమ్మ లాంటిదన్నారు. హిందీని నేర్చుకోవడం ద్వారా భారతీయులు మరింత బలపడతారని, ఇది జాతీయ సమైక్యతకు దోహదపడుతుందని అన్నారు. హిందీపై రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. హిందీపై అభిమానంతోనే ఖుషీ సినిమాలో తాను హిందీ పాటను పెట్టానని గుర్తు చేశారు.
పవన్ కల్యాణ్ ప్రసంగంపై సోషల్ మీడియాలో కొంత మంది విమర్శలు చేస్తున్నారు. అదేదో పెద్ద తప్పయినట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ హిందీ నేర్చుకోమని చెప్పడం అంటే తెలుగు నేర్చుకోవద్దని చెప్పడమన్నట్లుగా కొంత మంది విశ్లేషిస్తున్నారు. మొదటగా మాతృభాషను అమ్మగా పవన్ చెప్పారు. హిందీ నేర్చుకోవడం వల్ల సరిహద్దులు దాటితే మనల్ని కలుపుతుందన్నారు. భారతదేశంలోని వివిధ సంస్కృతులను, భాషలను ఒక కామన్ థ్రెడ్గా హిందీ ఉంటుందన్నారు. ఇదెలా తప్పు అవుతుందో ఒక్కరూ చెప్పడం లేదు.
హిందీ అంటే అదేదో బీజేపీ సొత్తు అయినట్లుగా..బీజేపీ భావజాలం అయినట్లుగా రాజకీయం చేస్తున్నారు. కానీ హిందీ అనేది భారత దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష. అవకాశాల కోసం ఇప్పుడు యువత దేశం.. ప్రపంచం మొత్తం వెళ్తున్నారు. మొదట మాతృభాష.. తర్వాత ఇంగ్లిష్.. ఆ తర్వాత హిందీని నేర్చుకుంటున్నారు నేటి తరం. అందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయం కోసం హిందీని భూతంగా చూపడం.. అలా చేయవద్దని చెప్పేవారిపై వ్యతిరేకత పెంచడం చేస్తున్నారు. పవన్ స్పీచ్ ను వ్యతిరేకించేవారిలోనూ అదే కనిపిస్తోంది.