విజయసాయిరెడ్డి అంటే జగన్ రెడ్డి ఆత్మ. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కేవీపీ ఎలాంటి వ్యక్తో.. జగన్ కు విజయసాయిరెడ్డి అలా. కానీ ఇప్పుడు ఏమయింది ?. విజయసాయిరెడ్డి జగన్ కు దూరమయ్యారు. తనను కావాలని దూరం పెట్టారని ఘోరంగా అవమానించారని అందుకే తాను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని విజయసాయిరెడ్డి చెప్పారు. జగన్ రెడ్డి తనను ఎందుకు దూరం పెట్టారో.. విజయసాయిరెడ్డి కొన్ని సందర్భాల్లో వెల్లడించారు.
జగన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ తన గురించి తప్పుడు ప్రచారాలు చేసిందని, వేల కోట్లు తాను దోచుకున్నట్లుగా ఆయనకు చెప్పిందని చెప్పారు. ఆయనకు వెన్నుపోటు పొడుస్తానని పార్టీకి ద్రోహం చేస్తానని కూడా చెప్పారన్నారు. విజయసాయిరెడ్డి మాటల్లో ఉన్న బాధను అర్థం చేసుకుంటే.. తన ఫోన్ ను ట్యాప్ చేసి.. ఇతరులతో వివిధ సందర్భాల్లో అన్యాపదేశంగా మాట్లాడిన మాటలను రికార్డు చేసి జగన్ కు వినిపించారు. దాని వల్లే అత్యంత నమ్మకస్తుడైన విజయసాయిరెడ్డిని జగన్ దూరం చేసుకున్నారు.
లేకపోతే విజయసాయిరెడ్డిని చెప్పుడు మాటలతోనే జగన్ దూరం చేసుకునే అవకాశాలు ఉండవు. విజయసాయిరెడ్డి నోరు విప్పితే తనకు జైలు గతి తప్పదని తెలిసి కూడా జగన్ వదులుకున్నారు. అంతే కాదు.. విజయసాయిరెడ్డి పార్టీని లాక్కుంటారని చెప్పి ఓ ప్లీనరీలో ఆయనతోనే శాశ్వత అధ్యక్షుడిగా తీర్మానం కూడా చేయించారు. ట్యాపింగ్ గురించి విజయసాయిరెడ్డికీ బాగా తెలుసు. ఆయన కూడా బయటకు వస్తే.. చాలా విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.