ప్రపంచానికి ప్రశాంతత కరవైంది. ఉక్రెయిన్, రష్యా ఇంకాతగలబడుతూనే ఉన్నాయి. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో వందల మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య క్షిపణులు పేలాయి. ఎలాగో రెండు దేశాలు సర్దుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ డైరక్ట్ వార్ ప్రారంభే అవకాశాలు పెరిగాయి. ఇజ్రాయెల్.. ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు చేసింది.
ఇజ్రాయెల్ హఠాత్తుగా ఇరాన్పై దాడి చేసింది. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ అధిపతి జనరల్ హుస్సేన్ సలామీ చనిపోయారు. శుక్రవారం ఉదయమే ఇజ్రాయెల్ “ఆపరేషన్ రైజింగ్ లయన్” పేరుతో ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని IRGC ప్రధాన కార్యాలయంపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడులు ఇరాన్ అణు కార్యక్రమం , సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. సలామీ 2019 నుండి IRGC కమాండర్-ఇన్-చీఫ్గా ఉన్నారు. ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్ కార్యక్రమాన్ని పర్యవేక్షించే కీలక వ్యక్తి.
ఈ దాడిలో ఇరాన్ సైనిక చీఫ్ మొహమ్మద్ బఘేరీ, సీనియర్ IRGC కమాండర్ ఘోలామ్ అలీ రషీద్, ఇరాన్ అణు కార్యక్రమంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు కూడా చనిపోయినట్లుగా భావిస్తున్నారు. ఇరాన్ అణు ఆయుధాలను నిరోధించడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ దాడితో ఇరాన్ ఖాళీగా ఉండే అవకాశాలు లేవు. ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ తెలిపింది. ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇరాన్ తొమ్మిది అణు బాంబులకు సరిపడా అధిక సంవర్ధన యురేనియం సేకరించినట్లు ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. ఇది తమకు ముప్పు కలిగిస్తుందని అందుకే దాడులు చేశామని సమర్థించుకుంటోంది. ఇజ్రాయెల్ దాడులకు సంబంధించిన ఆందోళనలతో, అమెరికా ఇరాక్లోని తన దౌత్యవేత్తలను వెనక్కి పిలిచింది. ఇరాన్ నుండి ప్రతీకార దాడులు జరుగుతాయని అనుమానిస్తున్నారు. ఇజ్రాయెల్ కే అమెరికా మద్దతు ఇస్తోంది.