ఏపీలో ఒకరికొకరు కొట్టుకుని..తిట్టుకునేందుకు రాజకీయాలు పెడుతున్న చిచ్చు ఇప్పుడు శ్రీవారి అర్చకుల మధ్య కూడా ప్రారంభమయింది. అర్చక వ్యవస్థ, శ్రీవారి ఆలయం నాశనమయ్యే లోపు ‘వన్ మ్యాన్ కమిటీ నివేదిక’ను టిటిడిలో అమలు చేయాల్సిన అవసరం ఉందని రమణదీక్షితులు బుధవారం మధ్యాహ్నం ట్వీట్ చేశారు. జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వన్ మ్యాన్ కమిటీ నివేదికతో .. ఆలయ బాధ్యతలు మళ్లీ తన చేతికి వస్తాయని రమణదీక్షితులు ఆశిస్తున్నారు. కానీ సీఎం జగన్ రమణదీక్షితుల కోరికను పట్టించుకోవడం లేదు.
రమణదీక్షితుల ట్వీట్పై స్పందించాలని ప్రస్తుత ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులపై ఒత్తిడి రావడంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. తిరుమలలో అర్చక వ్యవస్థ సవ్యంగా, సంతృప్తికరంగా ఉందన్నారు. సిఎం జగన్తో తమ నాలుగు కుటుంబాల అర్చకులు సమావేశమయ్యామని, 142 సెక్షన్ ప్రకారం 1997లో తమను పర్మినెంట్ చేశారనీ, తమ పిల్లలు కూడా స్వామివారి సేవ చేసుకునే అవకాశం కల్పించారని తెలిపారు. 1997లో కమిటీ రిపోర్ట్ ప్రకారం మిరాశీదారులను ఉద్యోగస్తులుగా తీసుకున్నారనీ, అప్పటి నుంచి అర్చకులు సంభావన అర్చకులుగా పని చేస్తున్నారని చెప్పారు. జిఒ నం.855 ప్రకారం తమ సర్వీసును 2018లో రెగ్యులరైజ్ చేశారని తెలిపారు.
సెక్షన్ 142 ప్రకారం తమకు గౌరవ మర్యాదలు అందుతున్నాయనీ, తమ కుటుంబంలోని పిల్లలకు 142 సెక్షన్ అమలు చేయాలని సిఎం జగన్ను కోరామనీ, దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. అర్చక వ్యవస్థను అర్చకేతరులు నాశనం చేస్తున్నారని ఆరోపిస్తున్న రమణ దీక్షతులకే వాళ్లు ఎవరో తెలియాలన్నారు. రమణ దీక్షతులకు కూడా సెక్షన్ 142 ప్రకారం అన్ని గౌరవ మర్యాదలు అందుతున్నాయని తెలిపారు. పింక్ డైమండ్ ఆరోపణలతో నిక్షేపంలా ఉన్న తన పదవికి ఎసరు తెచ్చుకున్న రమణదీక్షితులు ఇప్పుడు ఆ పదవి కోసం ఒత్తిడి చేస్తూంటే.. ఆయనపైనే ఎదురుదాడి చేయిస్తున్నారు. మొత్తంగా నష్టంపోయింది రమణదీక్షితులే.