వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు నిలిపేశారు. గతంలో తమ పార్టీ నేతను అరెస్టు చేయగానే బెంగళూరు నుంచి వచ్చి జైలుకు పోయి పరామర్శించేవారు. జైలు ముందు షో చేయడానికైనా ఆ పని చేసేవారు. కానీ ఇప్పుడు ఇంకా ఇంకా అరెస్టువుతున్నా.. పట్టించుకోవడం లేదు. కాకాణి గోవర్ధన్ రెడ్డి అందాన్ని చూడటానికి జగన్ వస్తారా అని సోమిరెడ్డి కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదు. జగన్ ఇప్పటికిప్పుడు పరామర్సించాల్సిన అన్నల జాబితా చాలా ఉంది. విజయవాడ జైలు.. నెల్లూరు జైల్లో చాలా మంది ఉన్నారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అందర్నీ అన్నా సంబోధిస్తారు. వారి గురించి బయట మీడియాతో మాట్లాడేటప్పుడు అలాగే మాట్లాడతారు. సవాంగ్ అన్నా, సీతారామ్ అన్నా.. ధనుంజయ్ అన్నా.. ఇలా. తాను చిన్నవాడ్నని.. వాళ్లంతా పెద్దవాళ్లని గౌరవం ఇస్తున్నారని అందరూ అనుకుంటారు. జగన్ రెడ్డి ఉద్దేశం కూడా అదే.. కానీ అందరూ వయసులో కాకుండా అనుభవంలో పెద్దవారని అందుకే గౌరవం ఇస్తున్నారని అనుకుంటారు. కానీ వయసులో చిన్నవాడ్ని కానీ వాళ్లనే శాసించే స్థాయిలో ఉన్నానని జగన్ అనుకుంటూ అన్నా అన్నా అని పిలుస్తూంటారు.
ఈ అన్నలందరూ జైలుకు ఎందుకు వెళ్లారో జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. ఆయనను నమ్మి ఆయన కోసం అడ్డగోలు పనులు చేసినందుకే జైలుకెళ్లారు. మరి వీరిని పరామర్శించేందుకు జగన్ ఎందుకు వెళ్లడం లేదు.. వారి కుటుంబాలకు ఎందుకు ధైర్యం చెప్పడం లేదన్నది వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్న ప్రశ్న. తన కోసం జైలుకెళ్లిన నేతల్నే పట్టించుకోవడంలేదని ఇక సామాన్య కార్యకర్తల్నేం పట్టించుకుంటారని.. క్యాడర్ నిట్టూరుస్తున్నారు.