నెక్ట్స్ మూడు నెలల్లో నేనే సిఎం, ఆరునెలల్లో మన ప్రభుత్వమే రాబోతోంది, మన పార్టీ అధికారంలోకి వచ్చాక నా తడాఖా చూపిస్తా……ఇదీ వైఎస్ జగన్ స్టైల్. టార్గెట్ ఉండొచ్చు. కానీ ఆ టార్గెట్గా కోసమే డెస్పరేట్గా ట్రయల్స్ వేస్తూ వెళుతుంటే ఇక ప్రజా ప్రయోజనాల గురించి ఏం కన్సర్న్ ఉన్నట్టు? వైఎస్ జగన్ ప్రతి మాట, ప్రతి యాక్టివిటీకూడా అధికారంలోకి రావడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నంగానే కనిపిస్తోంది. అందుకే బిజెపి, టిడిపిల రాజకీయ తెలివి తేటలముందు వైఎస్ జగన్ తేలిపోతున్నాడు.
టిడిపి, బిజెపిలు రెండూ కూడా ప్రత్యేక హోదా సంకటం నుంచి బయటపడాలనుకుంటున్నాయి. అందుకోసం చాలా చాలా తెలివిగా సీమాంధ్రప్రజలకు ద్రోహం చేయడానికి రెడీ అయిపోయాయి. ఆ విషయాలను నిజాయతీగా ప్రజల దృష్టికి తీసుకెళ్ళడంలో మాత్రం వైఎస్ జగన్ ఫెయిల్ అవుతున్నాడు. ఎంతసేపూ చంద్రబాబునాయుడ్ని తిట్టడం, ఆయనను రాజీనామా చేయమని అడగడం, టిడిపి పార్టీ సర్వనాశనం అయిపోతుందని శాపనార్థాలు పెట్టడం తప్పితే నరేంద్రమోడీ గురించి, ఆయన చేసిన వంచన గురించి ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం జగన్కు లేదు. అందుకే చంద్రబాబు వైఫల్యాలు ఏవీ కూడా జగన్ పార్టీకి కలిసిరావడం లేదు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నా పరిస్థితి ఇలాగే ఉంటుందని, ఆయనకు కూడా మోడీపైన పోరాడేంత సీన్ లేదని సీమాంధ్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. నరేంద్రమోడీతో పొత్తు పెట్టుకుని ఉన్న చంద్రబాబు, మోడీతో మంచి సంబంధాలు ఉన్న పవన్ కళ్యాణ్కి… ప్రతిపక్షనేత జగన్కు తేడా లేకుండా పోయింది. అందరూ కూడా మోడీకి భయపడేవాళ్ళే. మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేసే ధైర్యం ఎవ్వరికీ లేదు అన్న కఠోర వాస్తవం సీమాంధ్ర ప్రజలకు తెలిసిపోతూ ఉంది.
స్పీకర్ ఛెయిర్ దగ్గర ఉన్న మైకులు విరగ్గొట్టడం, సిఎం రాజీనామా చేయాలనడం, పొద్దస్తమానం చంద్రబాబును తిట్టడమే పనిగా పెట్టుకునే పాత….ఒకింత రోత రాజకీయాన్ని కూడా కట్టిపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం నరేంద్రమోడీతో వైఎస్ జగన్ పోరాడగలడా? లేదా? అన్న విషయాన్ని తేల్చి చెప్తే బాగుంటుంది. రాష్ట్ర బంద్ అయినా, ప్రత్యేక హోదా ఉద్యమమైనా నరేంద్రమోడీ వంచన గురించి దేశం మొత్తానికి తెలిసేలా చేస్తే ఆ పోరాటానికి ఓ అర్థం ఉంటుంది. అలాగే జగన్పైన సీమాంధ్ర ప్రజలకు నమ్మకం కలుగుతుంది. అలా కాకుండా ఎంత సేపూ చంద్రబాబును కార్నర్ చేయాలని ట్రై చేస్తూ ఉంటే…………‘ఓహో……ఈయన ప్రయత్నం అంతా మన కోసం కాదా? చంద్రబాబుని దింపేసి… ఆ ఛెయిర్లో ఈయన కూర్చోవడం కోసమా……?’ అని సీమాంధ్ర ప్రజలు భావించే ప్రమాదం ఉంది.