కొన్నాళ్లుగా రెండు తెలుగు ప్రభుత్వాలూ చిత్రసీమను పట్టించుకోలేదు. అవార్డుల సంగతి సరే సరి. ఏళ్లకు ఏళ్లుగా అవార్డులు పెండింగ్ లో ఉండిపోయాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి తొలి అడుగు పడింది. ‘గద్దర్’ పేరుతో అవార్డులు ఇస్తామని కొంతకాలం క్రితమే రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు అమలు చేశారు. అవార్డు కమిటీ ఛైర్పర్సన్ జయసుధ కొద్ది సేపటి క్రితం అవార్డు సినిమాల లిస్టు ప్రకటించారు.
2024కు గానూ ఉత్తమ చిత్రం కల్కిని ఎంపిక చేశారు. ద్వితీయ ఉత్తమ చిత్రంగా పొట్టేల్, మూడో ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ నిలిచాయి. ఉత్తమ బాలల చిత్రం కేటగిరీలో `35 – చిన్న కథ కాదు`కి అవార్డు దక్కింది. రజకార్, ఆయ్, కమిటీ కుర్రాళ్లు వివిధ కేటగిరీల్లో అవార్డులు దక్కించుకొన్నాయి.
ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ (కల్కి), ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ (పుష్ప 2), ఉత్తమ నటిగా నివేదా థామస్ (35), ఉత్తమ సహాయ నటుడిగా సూర్య (సరిపోదా శనివారం), ఉత్తమ సహాయ నటి శరణ్యా ప్రదీప్ (అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్), ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ (రాజూ యాదవ్), ఉత్తమ హాస్య నటుడు సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా) ఎంపికయ్యారు. ఉత్తమ జర్నలిస్టుగా రెంటాల జయదేవ్ (ఫస్ట్ రీల్ పుస్తకానికి గానూ) అవార్డు అందుకోబోతున్నారు. జూన్ 14న ఈ అవార్డుల్ని అందజేస్తారు.
14 ఏళ్ల తరవాత తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అవార్డులివి. ఇక మీదట ప్రతీ యేటా క్రమం తప్పకుండా ఇవ్వాలన్న కృత నిశ్చయంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఏపీ ప్రభుత్వం కూడా ఈ దిశగా ఎంత త్వరగా అడుగులేస్తే అంత మంచిది.