మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ క్రియేట్ చేసిన సూపర్హిట్ సిరీస్ దృశ్యం. ఇప్పటికే వచ్చిన రెండు సినిమాలు విజయాన్ని అందుకున్నాయి. మాతృకలో మోహన్లాల్ నటించగా, రీమేక్లలో వెంకటేష్ (తెలుగు), అజయ్ దేవ్గన్ (హిందీ) కనిపించారు. అన్నీ వెర్షన్లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు దృశ్యం 3 కథ కూడా పూర్తయింది.
అయితే ఈసారి అన్నీ భాషల్లో ఒకేసారి షూట్ చేసి, ఒకే డేట్కి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు జీతూ జోసెఫ్. ‘‘మలయాళంలో నేను రాసిన కథతోనే హిందీ, తెలుగు భాషల్లో దృశ్యం 3 వస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. హీరోల డేట్స్ కారణంగా ఈ సినిమాను ఒకే సమయంలో చిత్రీకరించలేకపోవచ్చు. కానీ అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాం’’ అన్నారు జీతూ.
జీతూ ఇలాంటి ప్రకటన చేయడానికి కారణం వుంది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. ఒక్క భాషలో విడుదలైనా ఆ సస్పెన్స్ రివీల్ అయిపోతుంది. దృశ్యం 2కి ఇదే జరిగింది. దృశ్యం 2 మలయాళం వెర్షన్ ఫిబ్రవరి 2021లో వచ్చింది. తెలుగు వెర్షన్ అదే ఏడాది నవంబర్లో నేరుగా అమెజాన్ ప్రైమ్లో విడుదలయ్యింది. అయితే అప్పటికే మలయాళం వెర్షన్ చూసేయడంతో తెలుగు వెర్షన్కి రావాల్సిన వ్యూవర్షిప్ రాలేదు.
అందుకే ఇప్పుడు అన్నీ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని చూస్తున్నారు. కానీ ఇది మామూలు విషయం కాదు. గౌతమ్ మీనన్ ఇలాంటి ప్రయోగం గతంలో నాగచైతన్య, శింబుతో చేసి లెంపలు వేసుకున్నాడు. ఇద్దరు హీరోలతో ఏకకాలంలో సినిమా తీయడం తలకుమించిన పని అని వాపోయాడు. దృశ్యం 3 అయితే ముగ్గురు హీరోలు చేయాలి. అందులోను ఒకే సమయంలో రిలీజ్ అంటున్నారు. మరి ఈ టాస్క్ ఎలా వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.