కడప మేయర్ సురేష్ బాబుపై అనర్హతా వేటు పడింది. హైకోర్టు సింగిల్ బెంచ్ కూడా సమర్థించింది. అయితే డివిజనల్ బెంచ్ కు వెళ్లి స్టే తెచ్చుకున్న ఆయన తన పద్దతి మార్చుకోలేదు. కడప మున్సిపాల్టీ సర్వసభ్య సమావేశాన్ని హాల్లో కాకుండా తన చాంబర్ లో నిర్వహించుకుని అధికారులంతా అక్కడికే రావాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ ఎవర వెళ్లలేదు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కడప మేయర్ సీటు పక్కన కడప ఎమ్మెల్యేకు సీటు వేసేవారు. మేయర్ పక్కనే కడప ఎమ్మెల్యేగా ఉన్న అంజాద్ భాషా కూర్చునేవారు. ఆయన హాజరు కాకపోయినా ఆ కుర్చీ మాత్రం వేసేవారు. ప్రభుత్వం మారిన తర్వాత కడప మేయర్ ఆ సంప్రదాయాన్ని పాటించడం లేదు. కడప ఎమ్మెల్యేగా రెడ్డప్పగారి మాధవి గెలవడంతో ఆమెకు ఆ గౌరవం ఇవ్వలేదు. ఈ అంశంపై గొడవలు అయ్యాయి.
ఆయన కుటుంబసభ్యులు అక్రమంగా టెండర్లు పొందినట్లుగా తేలడంతో ఆయనపై అనర్హతా వేటు పడింది. ఎన్ని సార్లు వివరణ అడిగినా పట్టించుకోలేదు. చివరికి తన కుటుంబసభ్యులు కాంట్రాక్టులు చేసినట్లుగా తనకు తెలియదని చెప్పుకొచ్చారు. ఆయన వివరణపై సంతృప్తి చెందని ప్రభుత్వం అనర్హతా వేటు వేసింద. అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ మాత్రం ఆయన వాదన మరోసారి వినాలని ఆదేశించి స్టే విధించింది. దీంతో తన పదవి నలబడిందని సురేష్ బాబు రెచ్చిపోయారు.
అధికారులు సమావేశం హాల్లో.. కడప ఎమ్మెల్యేకు సీటు వేశారు. అందుకే ఆయన సమావేశానికి రాకుండా తన చాంబర్ కే కార్పొరేటర్లకు పిలిపించుకుని అక్కడికి అధికారులు రావాలని హుకుం జారీ చేశారు. కానీ ఎవరూ వెళ్లలేదు. సురేష్ బాబు వ్యవహారంతో.. కడప కార్పొరేషన్ పాలకమండలి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.