సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ భారతీయ జనతా పార్టీలో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ విషయంపై భారతీయ జనతాపార్టీ హైకమాండ్ ఏపీ నేతలకు ముందస్తు సంకేతాలు పంపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాక్షాత్తూ.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ .. ఈ విషయంలో బయటపడ్డారు. పదవి వచ్చిన సందర్భంగా తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు ఇచ్చారు. తిరుపతిలో రాజకీయాలు మాట్లాడారు. ఆ సమయంలో కన్నా.. బీజేపీ అధికారంలోకి వచ్చేయబోతుందని ప్రకటించేశారు. 2019లో ఏపీలో.. బీజేపీ ముఖ్యమంత్రి ఉంటారన్నారు. కన్నా లక్ష్మినారాయణ కాన్ఫిడెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో తాము అధికారంలోకి వస్తామని చెప్పిన వెంటనే .. జర్నలిస్టులు కూడా.. ముఖ్యమంత్రి మీరా..? సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణనా..? అని అడిగేశారు. దానికి కన్నా లక్ష్మినారాయణ.. ఆ విషయం అమిత్ షా, నరేంద్రమోదీ నిర్ణయిస్తారని ప్రకటించారు. దాంతో ఆశ్చర్యపోవడం విలేకరుల వంతయింది.
నిజానికి సీబీఐ మాజీ జేడీ బీజేపీలోకి వెళ్తానని ఎప్పుడూ ప్రకటించలేదు. కనీసం చర్చలు జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా చెప్పలేదు. అలాంటిది.. ఆయన ప్రస్తావన వస్తే… ఖండించాల్సిన కన్నా లక్ష్మినారాయణ అంతా హైకమాండ్ నిర్ణయం అన్నట్లు మాట్లాడటంతో… అంతర్గతంగా… బీజేపీలో సీబీఐ మాజీ జేడీని చేర్చుకునే ప్రక్రియ నడుస్తున్నట్లు తేలిపోయిందంటున్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ప్రస్తుతం జిల్లాల పర్యనటల్లో ఉన్నారు. జిల్లాల్లో ఉన్న సమస్యలను రెండు నెలలలో అధ్యయనం చేస్తానని.. ఆ తర్వాత కార్యాచరణ రూపొందించుకుటానని చెప్పారు. రాజకీయాల్లోకి వస్తానని ఇంత వరకూ నేరుగా ప్రకటించలేదు కానీ.. వ్యవసాయమంత్రిని కావాలన్న ఆకాంక్షను మాత్రం వ్యక్తం చేశారు.
సీబీఐ మాజీ జేడీకి.. ఆరెస్సెస్ తో దగ్గరి సంబంధాలున్నాయన్న ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. ఉద్యోగ విరమణ తర్వాత జరిగిన ఓ ఆరెస్సెస్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు… కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ నోటి వెంట… అప్రయత్నంగా వచ్చిన మాటలు.. బీజేపీ ప్లాన్లను బయటపెట్టిందని.. రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. సీబీఐ మాజీ జేడీ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నప్పుడే.. ఆయన బీజేపీలోకి వెళ్తారని అనుకున్నారు. ఎస్కే యూనివర్శిటీ వీసీగా ఉన్న లక్ష్మినారాయణ బంధువు కూడా రాజీనామా చేసి… ఆయనతో పాటే నడుస్తానని ప్రకటించారు. అంతా ఓ పద్దతి ప్రకారమే బీజేపీ… నడిపిస్తోందని.. సీబీఐ మాజీ జేడీ బీజేపీలో చేరడం లాంఛనమేనన్న అభిప్రాయాలు.. కన్నా లక్ష్మినారాయణ మాటలతో తేటతెల్లమయ్యాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.