బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన అసంతృప్తిని దాచుకోవడానికి సిద్ధంగా లేరు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను నేరుగా టార్గెట్ చేశారు. పార్టీని బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారని దాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు. పార్టీ ఫోరమ్లో మాట్లాడాలని అంటున్నారని.. అక్కడ ఏముందని ప్రశ్నించారు. తాను అంతర్గతంగానే లేఖ రాశానని ఎందుకు బయట పెట్టారని ప్రశ్నించారు. కేసీఆర్ తాను రాసిన లేఖలను చదివిన తర్వాత చించేస్తారని కానీ ఈ సారి మాత్రం బయటకు వచ్చిందన్నారు.
పార్టీని అంతా తామే నడిపిస్తున్నామని ఫీలవుతున్నారని.. కానీ సిల్వర్ జూబ్లీ సభను తామే సక్సెస్ చేసినట్లుగా ప్రచారం చేసుకుంటూంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ఇంటి ఆడబిడ్డపై ఇష్టానుసారం మాట్లాడిస్తున్నారని.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారని విమర్శించారు. పదవులు కోరినట్లుగా పత్రికల్లో తప్పుడు వార్తలు ప్రచురింప చేస్తున్నారని మండిపడ్డారు. తాను కేసీఆర్ లా తిక్కదాన్నని.. ఏమున్నా ఫేస్ టు ఫేస్ తేల్చుకుంటామన్నారు. వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియవన్నారు. పార్టీలో కొందరు స్థాయికి మించి ఊహించుకుంటున్నారని మండిపడ్డారు.
తనను అరెస్టు చేసినప్పుడు పార్టీకి, పదవికి కూడా రాజీనామా చేస్తానని చెప్పానని…కానీ కేసీఆర్ ను ఏం చేయలేక తనపై కేసులు పెట్టారని అందుకే రాజీనామాలు వద్దని చెప్పారన్నారు. కాంగ్రెస్ తో తాను సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేశారు. 2013లో కాంగ్రెస్ తో మాట్లాడిన మాట నిజమన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి ప్రతిపాదనలు పెట్టలేదన్నారు. పార్టీ చేసే పనులు సగం తాను చేస్తున్నానని కవిత స్పష్టం చేశారు. తనను విమర్శించే వారికి పార్టీని నడిపే సత్తా లేదన్నారు.
మీడియా చిట్ చాట్ లో కవిత ఎక్కడా కేటీఆర్ పేరు తీసుకు రాలేదు. కానీ ప్రతి మాటా కేటీఆర్ ను ఉద్దేశించే అన్నట్లుగా స్పష్టమవుతోంది. ఇప్పుడు చిట్ చాట్ రేపు నేరుగా ప్రెస్ మీట్ పెట్టినా ఆశ్చర్యం ఉండదన్న అభిప్రాయం బీఆర్ఎస్లో వినిపిస్తోంది.