తాను వ్యవస్థాపక అధ్యక్షురాలిగా ఉన్న తెలంగాణ జాగృతిని పార్టీగా ప్రకటించాలని అనుకుంటున్నారో, లేదంటే తెలంగాణ జాగృతి పవర్ ఏంటో చూపించాలని ఉత్సాహపడుతున్నారో కవిత దూకుడు రాజకీయం చేస్తున్నారు. వరుసగా జాగృతి అనుబంధ కమిటీలను ప్రకటిస్తున్నారు. విద్యార్థి విభాగం అధ్యక్షులు, సింగరేణి అధ్యక్షులను ప్రకటించారు కవిత. కానీ, బీఆర్ఎస్ మాత్రం ఆ స్థాయి దూకుడు కనబరచడం లేదు. బీఆర్ఎస్ కు ఆ పార్టీ విద్యార్థి విభాగం వెన్నుముక. అయినా ఆ విభాగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర నాయకత్వం ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత బీఆర్ఎస్ అనుబంధ విభాగాల కమిటీలకు నూతన అధ్యక్షులను ప్రకటిస్తారని లీకులు ఇచ్చారు. ఉద్యమ సమయంలో బాల్క సుమన్ వంటి అగ్రెసివ్ నేతలకు విద్యార్థి విభాగం పగ్గాలు ఇవ్వడం వలన విద్యార్థి విభాగం ఊహించని విధంగా బలోపేతం అయింది. అధికారంలోకి వచ్చాక గెల్లు శ్రీనివాస్ కు ఇచ్చినా ఆశించిన తీరులో విద్యార్థి విభాగం పని చేయలేకపోయింది. దాంతో ఈసారి కొత్త కమిటీలో ముప్పై ఏళ్లలోపు ఉన్న విద్యార్థి నేతలకు పగ్గాలు ఇవ్వాలని డిమాండ్లు ఉన్నాయి. కేసీఆర్ , కేటీఆర్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు.
ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనుబంధ విద్యార్థి సంఘం పాత్ర ఆ పార్టీకి కొత్త జవసత్వాలు ఇస్తోంది. అందుకే ఈసారి ముప్పై ఏళ్లకు పైబడినా నేతలకు ఇవ్వొద్దని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఓయూ విద్యార్థి నేతల్లో ఓ బీసీ సామాజిక వర్గం నేత పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. జాగృతి విద్యార్థి విభాగం అధ్యక్షులను కవిత ప్రకటించడంతో బీఆర్ఎస్ కూడా త్వరలోనే కొత్త రాష్ట్ర కమిటీని ప్రకటించాల్సిన అనివార్యత ఏర్పడింది.