తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, జాగృతి అధ్యక్షురాలు కవిత త్వరలో కొత్త రాజకీయ ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ప్రజాజాగృతి పేరుతో పార్టీ పేరుకు అప్లికేషన్ పెట్టుకున్నారు. కానీ దానికి సాంకేతిక సమస్యలు వచ్చాయి. కోర్టులోనూ పిటిషన్ వేశారు. ఇప్పుడు కవిత ప్లాన్ మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ పేరుతోనే పార్టీ పెట్టాలని అనుకుంటున్నారు.
హైదరాబాద్ లో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్లో మళ్లీ పాత పేరుతో, అంటే టీఆర్ఎస్ పేరుతో సరికొత్త ఎజెండాతో ముందుకు రాబోతున్నట్లు ఆమె సంకేతాలిచ్చారు. ప్రస్తుతం ఈసీ వద్ద ఆ పేరు అందుబాటులో ఉందని, పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఒక ప్రత్యేక బృందం ఢిల్లీలో పనిచేస్తోందని ఆమె వెల్లడించారు. పార్టీ జెండాలో మాత్రం పింక్ కలర్ ఉండదని చెప్పారు.
మాకు ఆంధ్రాతో సంబంధం లేదు, అమరావతి గురించి మేము పట్టించుకోము.. మాకు కేవలం తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం అని తేల్చి చెప్పారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పనితీరును మాత్రం ఆమె ప్రశంసించారు. క్షేత్రస్థాయిలో హార్డ్ వర్క్ చేయడంలో చంద్రబాబు సూపర్ అని, టీడీపీ పార్టీ నిర్మాణం చాలా బలంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. గజ్వేల్ నుంచి మహిళా రిజర్వేషన్ కింద పోటీ చేసే ఆలోచన ఉందన్న ఆమె, నిజామాబాద్ జిల్లాలో కూడా వచ్చే ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తనపై ఉన్న లిక్కర్ కేసు కొట్టేయడంపై స్పందిస్తూ.. నాకు ప్రకృతి సహకరిస్తోందని అనిపిస్తోంది. అదృష్టవంతుణ్ణి ఎవరూ ఆపలేరు అంటూ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చారని, ఇప్పుడు తెలంగాణ జాగృతి పార్టీ కోసం తాను కూడా నిరంతరం శ్రమిస్తానని కవిత స్పష్టం చేశారు.


