కాళేశ్వరం కమిషన్ ఎదుట బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ హాజరయ్యే తేదీలో మార్పు చోటు చేసుకుంది. కేసీఆర్ చేసిన విజ్ఞప్తి మేరకు కమిషన్ మరో తేదీన ఆయనను విచారణకు రావాలని సూచించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని రేవంత్ సర్కార్ జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈమేరకు అప్పటి సీఎం కేసీఆర్, సాగునీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటలకు నోటీసులు జారీ చేసింది.
కేసీఆర్ ను మొదట ఈ నెల ఐదో తేదీన , హరీష్ రావు తొమ్మిదో తేదీన విచారణకు రావాలని కమిషన్ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే కేసీఆర్ విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. అయితే సడెన్ గా ఆయన తాను ఐదో తేదీన విచారణకు హాజరు కాలేనని, పదకొండో తేదీన వస్తానని సమాచారం పంపించారు.
కేసీఆర్ అభ్యర్ధనను పరిశీలించిన కమిషన్.. విచారణ తేదీని మార్పు చేసింది. జూన్ ఐదో తేదీకి బదులుగా పదకొండో తేదీన హాజరు కావాలని సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆయన పలు అంశాలపై వివరణ ఇవ్వనున్నారు.అయితే, కేసీఆర్ షెడ్యూల్ మార్చాలని కోరడం వెనక రీజన్ ఏంటనే చర్చ జరుగుతోంది.
మొదట హరీష్ ను ఎలాంటి ప్రశ్నలు అడగనున్నారో తెలుసుకొని అధ్యయనం చేసి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన షెడ్యూల్ మార్చాలని కోరినట్టుగా టాక్ వినిపిస్తోంది.