భారత రాష్ట్ర సమితి రాజకీయాలు ఎవరూ ఊహించని విధంగా మారుతున్నాయి. కవిత మాట్లాడినప్పుడల్లా ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తారు అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కానీ అలాంటి సూచనలేమీ లేవు. పైగా కేసీఆర్ ఫోటోతోనే కవిత రాజకీయం చేస్తున్నారు. కేసీఆర్ , ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోలతోనే జాగృతి కొత్త కార్యాలయాన్ని ప్రకటించారు. కేసీఆర్ పై ఈగ వాలితే సహించేది లేదన్నారు. అంతే కాదు.. కేసీఆర్కు బీఆర్ఎస్ ఎంతో… జాగృతి కూడా అంతేనని తేల్చారు.
కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయని కవిత నమ్మకం
తన రాజకీయ పోరాటం విషయంలో కవిత చాలా స్పష్టంగా ఉన్నారు. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చబోతున్నారు. పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా ప్రకటించే ముందే ఆమె దాన్ని ఓ పోరాట సంస్థగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అప్పటి వరకూ బీఆర్ఎస్ నీడలోనే ఉంచుతారు. పేరుకే అలా ఉంచుతారు కానీ.. సరైన సమయం కోసం ఎదురు చూస్తారు.కేసీఆర్ ఆశీస్సులు తనకు ఖచ్చితంగా ఉంటాయని ఆయన మార్గనిర్దేశకత్వంలోనే పోరాటం ఉంటుందని కవిత సంకేతాలు ఇస్తున్నారు. ఇది ఆశ్చర్యకరమైన పరిణామమే అనుకోవచ్చు.
కేసీఆర్ రాజకీయ రిటైర్మెంట్ ?
ప్రస్తుతం కేసీఆర్ బీఆర్ఎస్ ను పూర్తిగా కేటీఆర్ కు అప్పగించారు. ఆయన రోజువారీ వ్యవహారాలు చూడటం లేదు. ఇప్పుడు కవిత ఇష్యూతో ఆయన మరింత మనస్తాపానికి గురయ్యారు. రాజకీయం కోసం తన బిడ్డల మధ్య చిచ్చు పెట్టి తాను ఒకరికి దూరం కావాలని అనుకోవడం లేదు. కవిత అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకే ఇప్పటి వరకూ చర్యలు తీసుకోవడం లాంటివి చేయలేదు. చేస్తారని కూడా అనుకోవడం లేదు. జాగృతి అనేది ఇంకా రాజకీయ పార్టీగా మార్చలేదు కాబట్టి పార్టీకి వ్యతిరేకం కాదని చెప్పుకోవచ్చు. కానీ ఇవాళ కాకపోతే రేపైనా వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. అందుకే కేసీఆర్ రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకుని.. పరోక్షంగా రెండు పార్టీలకు గౌరవాధ్యక్షుడిగా నేరుగా లేకపోతే పరోక్షంగా అయినా వ్యవహరించవచ్చని భావిస్తున్నారు.
కలుపుకుని పోలేని కేటీఆర్ వల్లే !
కేటీఆర్ చేసే దూకుడు రాజకీయాలపై కేసీఆర్ కు అంత నమ్మకం లేదు. చాలా కాలంగా పార్టీని నడిపించే బాధ్యతను ఇచ్చినా పెద్దగా మార్పును కేటీఆర్ చూపించలేకపోయారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన పాత్ర ప్రభావం తక్కుగానే ఉంది. పైగా నేతల్ని కాపాడుకోలేకపోతున్నారు. సొంత పార్టీలో కొంత మందిని ప్రోత్సహిస్తూ మరికొంత మందిని దూరం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ లో చేరిన చాలా మంది ప్రముఖ నాయకులు కేటీఆర్ తీరు వల్లనే పార్టీకి దూరమయ్యారు. అందుకే కేటీఆర్ నాయకత్వంపై కేసీఆర్ కూ అంత నమ్మకం లేదని అంటున్నారు.
కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన తర్వాత కేసీఆర్ అమెరికా వెళ్లే అవకాశం ఉంది. ఐదారు నెలల పాటు రాకపోవచ్చని చెబుతున్నారు. అప్పుడు బీఆర్ఎస్ రాజకీయం మరింత ముదిరి పాకాన పడనుంది.