తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజం నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన వయసు 83 ఏళ్ల. ఆయన గొప్పతనం, నటన గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగా నటుడిగా గుర్తింపు పొందారు. వయసు కారణంగా వచ్చిన పలు ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో తెల్లవారుజామున కన్నుమూసినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.
స్టేట్ బ్యాంక్లో పని చేసే సమయంలో నాటకాలు వేసేవారు. తర్వాత సినిమాల్లో అవకాశం దక్కించుకున్నారు. అహనా పెళ్లంట సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఓ దశలో.. రెండు, మూడు దశాబ్దాల పాటు కోట శ్రీనివాసరావు లేని తెలుగు సినిమా ఉండేది కాదు. రాజకీయాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. బీజేపీలో చేరి విజయవాడ నుంచి ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు కానీ మరో పార్టీలో చేరలేదు.
కోట శ్రీనివాసరావు కుమారుడు ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో కన్నుమూశారు. అప్పటి నుంచి ఆయన మానసికంగా దెబ్బతిన్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతూంటాయి. పరభాషా నటులకు ప్రోత్సహం, తెలుగువారిని చిన్న చూపు చూడటం వంటి అంశాలపై కోట శ్రీనివాసరావు తరచూ తన అసంతృప్తి వ్యక్తం చేసేవారు. తెలుగు నటులకే.. తెలుగు ఇండస్ట్రీలో ప్రోత్సాహం ఇవ్వాలనేవారు.