వీడియో సాక్షిగా బయట పడుతున్న బోటు ఆపరేటర్ నిర్వాకం

ఆదివారం సాయంత్రం జరిగిన విషాద సంఘటన రాష్ట్రం లోని యావత్ ప్రజానీకానికి బాధ కలిగించింది. బోటు ప్రమాదం లో మరణించిన వారి కుటుంబాలకి సానుభూతి తెలియజేస్తూ ఎంతో మంది నాయకులు కూడా ప్రకటనలిచ్చారు. ఇంతలో కాస్త రాజకీయరంగు కూడా పులుముకుంది ఈ దుర్ఘటన. ఇది పూర్తిగా ప్రభుత్వ, అధికారుల వైఫల్యమే అని కొందరు విమర్శలు కూడా చేసారు.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో ని చాలా మంది షేర్ చేస్తున్నారు. ప్రమాదం జరగడానికి బహుశా కొన్ని గంటల ముందు బోటు ఆపరేటర్ ని అధికారి అడ్డుకుంటున్న దృశ్యాలు ఉన్న వీడియో అది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బోటు వెళ్ళడానికి వీల్లేదని అధికారి గదమాయిస్తున్న దృశ్యాలు కూడా ఆ వీడియో లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే దీన్ని బోటు నిర్వాహకులు పెడచెవిని పెట్టి గవర్నమెంట్ బోటు సమయం దాటిన తర్వాత పర్యాటకులని ఎక్కించుకుని ప్రమాదానికి కారణమైనట్టు తెలుస్తోంది.

అయితే ఇక్కడ ప్రభుత్వానికి పూర్తిగా క్లీన్ చిట్ ఇవ్వడం మా అభిమతం కాదు. ప్రమాదాలెప్పుడూ ఎవరో ఒకరు అడ్డదారి త్రొక్కితేనో, నిర్లక్ష్యం చేస్తేనో జరుగుతాయి. కానీ అలాంటివి జరిగినప్పుడు ఎదుర్కొనడానికి ప్రభుత్వ యంత్రాంగం ఎంత సిద్దంగా ఉందనేదే ప్రశ్న. శాటిలైట్, అంతరిక్ష విషయాల్లో అభివృద్ది చెందిన దేశాలకే దీటైన సవాల్ విసురుతున్న భారత్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, డిజాస్టర్ రెస్క్యూ ల్లో మాత్రం ఆ దేశాల కంటే చాలా చాలా వెనుకబడి ఉంది.

ఈ సంఘటన వరకు మాత్రం, బోటు ని అడ్డగించడం వరకు అధికారి తన బాధ్యత సరిగ్గానే నిర్వర్తించినట్టు తెలుస్తున్నా, బోటు ఆపరేటర్ నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తున్నా, డిజాస్టర్ జరిగిన తర్వాత, అత్యంత వేగంగా స్పందించడం, రెస్క్యూ చేసిన వారిని క్షణాల్లో ఆస్పత్రికి తరలించే విషయం లో మాత్రం ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.