ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత రెండు రోజులుగా తీవ్ర దుమారం రేపిన అమిత్ షా లీక్ వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీ పర్యటనలో అమిత్ షాతో జరిపిన అంతర్గత సంభాషణలపై సంచలన వ్యాఖ్యలు చేసిన నాగేశ్వర్ వెనక్కి తగ్గారు. జనసేనాని పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్లపై తాను చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. కూటమి శ్రేణులు తనపై న్యాయపరమైన, రాజకీయపరమైన యుద్ధం ప్రకటించడం, పోలీస్ కేసులు నమోదు కావడంతోనే ఆయన ఈ లీగల్ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఈ యూ-టర్న్ తీసుకున్నారు.
ఒక టీవీ డిబేట్లో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఢిల్లీ వెళ్లి వైఎస్ జగన్ను తక్షణమే అరెస్ట్ చేయాలని అమిత్ షాను కోరారని, దానికి అమిత్ షా నిరాకరిస్తూ చంద్రబాబు ఇన్స్టంట్ ఫ్రెండ్ అయితే, జగన్ మాకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్.. ఆయన జోలికి వెళ్లొద్దు అని సలహా ఇచ్చినట్లు చెప్పారు. ఈ సమాచారం జనసేన అంతర్గత కోర్ కమిటీ సమావేశం నుంచి తనకు నమ్మకమైన వనరుల ద్వారా లీక్ అయిందంటూ ఆయన ఒక పులిహోర కథనాన్ని వండారు. ఈ వ్యాఖ్యలు కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య తీవ్ర అపనమ్మకాన్ని సృష్టించేలా మారడంతో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది.
నాగేశ్వర్ వ్యాఖ్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమిత్ షాతో జరిగిన ఆ అత్యున్నత స్థాయి సమావేశంలో పవన్, తాను మినహా మూడో వ్యక్తి లేరని.. అసలు జనసేనలో కోర్ కమిటీ అనే వ్యవస్థే లేనప్పుడు ఈ అబద్ధపు లీకులు ఎక్కడివి అని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడటం సరికాదని, 24 గంటల్లో ఆధారాలు చూపించకపోతే క్షమాపణ చెప్పాలని అల్టిమేటం జారీ చేశారు. అంతేకాకుండా, జనసేన లీగల్ సెల్ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ , సదరు వ్యాఖ్యలను ప్రసారం చేసిన టీవీ ఛానెల్పై క్రిమినల్ కేసులు నమోదు కావడంతో వ్యవహారం సీరియస్గా మారింది.
కేసులు నమోదు కావడం, అటు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలోనూ ఈ ఫేక్ నరేటివ్లపై గట్టిగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రొఫెసర్ నాగేశ్వర్ డిఫెన్స్లో పడ్డారు. సోషల్ మీడియా వేదికగా జనసైనికులు, టీడీపీ క్యాడర్ తన పాత వీడియోలను, వైసీపీ అనుకూల వైఖరిని బయటపెడుతూ తీవ్రస్థాయిలో ట్రోల్ చేయడంతో తన క్రెడిబిలిటీ దెబ్బతింటుందని ఆయన గ్రహించారు. ఈ న్యాయపరమైన వివాదం ముదిరితే అరెస్ట్ లేదా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయంతోనే, తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని పరోక్షంగా ఒప్పుకుంటూ ఆ వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించారు.
