రూ.80వేల అప్పు చెల్లించలేదని పిల్లల ముందే మహిళను చెట్టుకు కట్టేసిన ఉదంతం సంచలనం సృష్టించింది. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో జరిగింది. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల ఆగడాల్లో బయటకు వచ్చింది ఇది మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఘటనలు జరుగుతూ ఉంటాయి. చాలా మంది ఈ రుణాల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అందుకే ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఎప్పటికప్పుడు నియంత్రణ ఉండాలన్న అభిప్రాయం వినిపిస్తోంది.
తమిళనాడు ప్రభుత్వం ఇటీవల బలవంతపు ప్రైవేటు అప్పుల వసూళ్లను నియంత్రించేందుకు కీలకమైన బిల్లును తెచ్చింది. ప్రైవేటు సంస్థలు లేదా రుణ సంస్థలు బెదిరింపుల ద్వారా బలవంతంగా అప్పులు వసూలు చేసినా లేదా రుణేతర ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినా 5 సంవత్సరాల జైలు శిక్ష , రూ. 5 లక్షల వరకు జరిమానా విధించేలా చట్టం తెచ్చారు. రుణ సంస్థల ఒత్తిడి కారణంగా రుణగ్రహీత ఆత్మహత్యకు పాల్పడితే, సంస్థ నిర్వాహకులపై బెయిల్ లేని శిక్ష విధించే నిబంధన కూడా ఉంది. ప్రజలను రుణ సంస్థల దుశ్చర్యల నుండి రక్షించడం , బలవంతపు వసూళ్లను అరికట్టడం ఈ చట్టం లక్ష్యం అని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
ఇలాంటి చట్టం ఆంధ్రప్రదేశ్ లోనూ తీసుకు రావాల్సిన అవసరం కనిపిస్తోంది. రోజువారీ వడ్డీ వ్యాపారాలు ఏపీలో చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి. ముఫ్ఫై శాతానికిపైగా వసూలు చేస్తూంటారు. అదే సమయంలో.. స్థోమత లేకపోయినా అప్పులు ఇచ్చి వారిని తీర్చాలని టార్చర్ పెడుతూంటారు. రూ.80వేల అప్పు తీర్చలేక భార్యబిడ్డలను వదిలేసి ఆ వ్యక్తి పారిపోయాడంటే వారి వేధింపులు ఏ స్థాయిలో ఉండి ఉంటాయో ఆలోచించాల్సిన పని లేదు. అందుకే.. కుప్పం ఘటన మరోసారి జరగకుండా ఉండాలంటే.. వడ్డీ వ్యాపారాలను నియంత్రించాలి.. అది చాలా కష్టం కాబట్టి.. కనీసం బలవంతపు రుణ వసూళ్లపైనా చట్టాలు తీసుకురావాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.