అమరావతి ప్రాంత మహిళల మనోభావాలను కించపరిచేలా వైసీపీ అనుకూల జర్నలిస్ట్ కృష్ణంరాజుతో వ్యాఖ్యలు చేయించిన జగన్ పై మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారని పేర్కొన్నారు. అమరావతి ప్రాంత మహిళలను వేశ్యలుగా చిత్రీకరిస్తూ మీ మీడియాలో అవమానించవచ్చా? అని లోకేష్ ప్రశ్నించారు. అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం మీ దిగజారుడుతనానికి పరాకాష్ట అని, ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే, అది మీ మీదే పడుతుందన్నారు.
అమరావతిని దేవతల రాజధానిగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని, దేవతలు తిరగాడే రాజధాని నేలపై ఉండదని సాక్షి స్టూడియోలో కూర్చొని కృష్ణంరాజు విషం చిమ్మారు. ఈ అమరావతి చుట్టూ ప్రక్కల వేశ్యలు ఎక్కువగా ఉన్నారని రాజధాని ప్రాంత మహిళలను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడటంపై లోకేష్ కౌంటర్ ఇచ్చారు. అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధానే. మూడు రాజధానుల కపట కుట్ర పొత్తిళ్లలో తంతుంటే, జై అమరావతి అని నినదించిన శాంతమూర్తుల పవిత్ర భూమి మన రాజధాని. జగన్ అనే సైతాన్ను తరిమేసిన అన్ని మతాల దేవతలు, దేవుళ్లు కొలువైన రాజధాని అమరావతి. కన్నతల్లిని, సొంత చెల్లిని తరిమేసిన దుర్మార్గుడికి మహిళల త్యాగాలు, గొప్పతనం ఏం తెలుస్తుందన్నారు.
మహిళల జోలికి వచ్చినా, ఆడపిల్లలను అల్లరి చేసినా, అఘాయిత్యాలకు పాల్పడినా వారికి అదే చివరి రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తున్నారని లోకేష్ గుర్తు చేశారు. విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించేలా పాఠాలు బోధిస్తున్నాం.. మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తున్నామన్నారు.అమరావతిపై విషం చిమ్మేందుకు జన్మనిచ్చిన అమ్మలను, జన్మంతా మనతో నడిచిన మహిళా లోకాన్ని కించపరిచిన జగన్ రెడ్డి గ్యాంగ్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని వార్నింగ్ ఇచ్చారు. మహిళలను అవమానించిన జగన్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే దేవతల రాజధాని అమరావతి.. దెయ్యం జగన్ పనిపడుతుందన్నారు.