జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో ఏఐజీ ఆస్పత్రిలో మూడు రోజుల కిందట ఆయనను కుటుంబసభ్యులు చేర్చారు. ఆ రోజే చనిపోయారని వార్తలు వచ్చాయి.అయితే ఆయనకు వెంటిలేటర్ పై వైద్యం అందిస్తూ వచ్చారు. సీపీఆర్ చేసిన తర్వాత గుండె కొట్టుకోవడంతో పరిస్థితి మెరుగుపడుతుందని అనుకున్నారు. మూడు రోజులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆదివారం ఉదయం ఆయన మరణించినట్లుగా వైద్యులు గుర్తించారు.
మాగంటి గోపీనాథ్ జూబ్లిహిల్స్ నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఓ సారి టీడీపీ నుంచి రెండు సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచారు. గోపీనాథ్ .. చాలా చిన్న వయసులోనే .. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడే విద్యార్థి నేతగా భారీ ర్యాలీలు నిర్వహించి రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి 2014లో ఎమ్మెల్యే సీటు దక్కే వరకూ పార్టీ కోసం పని చేశారు. అనంతర పరిణామాలతో ఆయన బీఆర్ఎస్ లో చేరారు.
మాగంటి గోపీనాథ్ మృతితో బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం జరగనుంది. ఏడాదిలోనే ఆ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలను కోల్పోయింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇప్పుడు జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే అనారోగ్యంతో మరణించారు.