మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ పై మావోయిస్ట్ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరిట లేఖ విడుదల అయింది. లొంగిపోయిన కొంతమంది ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ జరిగిందని పేర్కొన్నారు.
నంబాల కేశవరావును లక్ష్యంగా చేసుకుని జనవరి, మార్చి నెలల్లో రెండు పెద్ద వార్తల ఆధారిత ప్రచారాలు జరిగాయి కానీ అవి విజయవంతం కాలేదన్నారు. రికీ సహా మరికొంతమంది ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఈ ద్రోహం జరిగిందని లేఖలో పేర్కొన్నారు.
నంబాల టార్గెట్ గా 20వేల మంది బలగాలు తమ చుట్టూ మొహరించారని , 10గంటల్లో ఐదు ఎన్ కౌంటర్లు చేశారని లేఖలో ప్రస్తావించారు. నాయకత్వాన్ని కాపాడే బాధ్యతను అందరూ చాలా చక్కగా నిర్వర్తిస్తూ, చివరి వరకు కేశవరావుకు చిన్న గీత కూడా తగలనివ్వలేదు. అందరూ అమరవీరులైన తర్వాత, నంబాలను సజీవంగా పట్టుకుని చంపారని లేఖలో పేర్కొన్నారు.అయితే, ఈ ఎన్కౌంటర్ నుండి 7 మంది సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు.
నాయకత్వం తమ బాధ్యతలను వదిలి పారిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్న వారందరూ సిగ్గుపడాలన్నారు. ఇక, పాకిస్తాన్ కోరితే కాల్పుల విరమణ చేశారు.. మేం చర్చలకు విజ్ఞప్తి చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని లేఖలో ప్రశ్నించారు వికల్ప్. ఇకనైనా చర్చలకు ముందు రావాలని అభ్యర్థించారు.