హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో ధాయ్ ల్యాండ్ సుందరి ఓపల్ సుచాతా చువాంగ్ శ్రీ విజేతగా నిలిచారు. మిస్ వరల్డ్ గా ఎంపికైన తర్వాత తాను మానసిక ఆరోగ్యం కోసం ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తానని..తన ఆశయాల గురించి గొప్పగా చెప్పారు. దాంతో జడ్జిలు ఆమెకే ఓటేశారు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో అత్యంత వైభవంగా జరిగిన ఈ ఫైనల్స్ కు.. 108 మంది అందగత్తెలు ఆయా దేశాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. భారత సుందరి నందిని గుప్తా.. టాప్ 20కి చేరుకున్నారు కానీ టాప్ 8వరకూ చేరుకోలేకపోయారు.
హైదరాబాద్లో ఈ వేడుక జరగడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ వచ్చింది. హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ఫైనల్స్ కోసం దేశంలోని ప్రముఖులంతా వచ్చారు. చిరంజీవి దంపతులు , రేవంత్ రెడ్డి దంపతులు కూడా హాజరయ్యారు.ఇండస్ట్రీ వర్గాల నుంచి ఫ్యాషన్ పై ఆసక్తి ఉన్న అందరూ హాజరయ్యారు. వేదికపై ఇషాన్ ఖట్టర్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. జడ్జిలలో సోనుసూద్, రానా దగ్గుబాటి, నమ్రతా శిరోద్కర్ కూడా ఉన్నారు. సోనుసూద్ కు బెస్ట్ మానవతావాది అవార్డు కూడా ఇచ్చారు.
భారతీయతతో కలసి.. అద్భుతంగా జరిగిన మిస్ వరల్డ్ పోటీలకు అంతే ఘనమైన ముగింపు లభించింది. థాయ్ ల్యాండ్ యువతికి పెద్దఎత్తున అభినందనలు అందుతున్నాయి. పోటీలను విజయవంతంగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి అందరూ కృతజ్ఞతలు తెలిపారు.