వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మరోసారి స్పీకర్ ను కలిసారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఆయన ఏడాది కిందటే రాజీనామా చేశారు. కానీ మండలి చైర్మన్ ఆమోదించడం లేదు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మండలి చైర్మన్ కు నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆయన మెల్లగా తీరిక చేసుకుని వ్యక్తిగత విచారణలకు పిలుస్తున్నారు.
ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు హాజరైనప్పుడు మీడియా ప్రతినిధులతో జయమంగళ వెంకటరమణ జగన్ ను పొగిడినట్లుగా ప్రచారం జరిగింది. తన దేవుడు జగన్ అని.. తాను అప్పుల్లో ఉన్నప్పుడు పిలిచిపదవి ఇచ్చి అప్పులన్నీ తిరిపోయేలా చేశారని ..అందుకే ఉదయమే లేచి ఆయన ఫోటోకు దండం పెట్టుకుంటానని చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఆయన ఖండించలేదు. దీంతో ఆయన రాజీనామా ఉపసంహరణపై వెనక్కి తగ్గుతారని ప్రచారం జరిగింది వైసీపీ నాయకత్వం ఆయనతో టచ్ లోకి వెళ్లిందని.. రాజీనామా ఉపసంహరించుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పినట్లుగా తెలుస్తోంది.
అయితే జయమంగళ వెంకటరమణకు మాత్రం రాజీనామా ఉపసంహరించుునే ఆలోచన లేదు. అందుకే ఆయన జనసేన కండువాతోనే స్పీకర్ విచారణకు హాజరయ్యారు. తాను ఎప్పుడో ఇతర పార్టీలో కూడా చేరిపోయానని తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని ఆయన మండలి చైర్మన్ ను కోరినట్లుగా తెలుస్తోంది. గురువారం కూడా మరో నలుగురు రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలను స్పీకర్ వ్యక్తిగతంగా మాట్లాడేందుకు పిలిచారు. ఆ తర్వాత రాజీనామాలపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
