విద్యుత్తు రంగంలో విప్లవం సృష్టించిన ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీకి పేరు. ప్రధాన మంత్రి అయిన తర్వాత కూడా విద్యుత్ రంగంపై దృష్టి పెట్టారు. ఆయన ఎంతో చొరవగా తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా మన దేశంలో ప్రతి ఏటా కనీసం వెయ్యి కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. వెలుగుకు వెలుగు, ఆదాకు ఆదా అన్న మాట.
పాతకాలపు బల్బులు, ట్యూట్ లైట్ల స్థానంలో అత్యాధునిక ఎల్. ఇ.డి. లైట్లను పంపిణీ చేపట్టారు. గురువారం సాయంత్రం వరకు దేశ వ్యాప్తంగా సరఫరా చేసిన ఎల్ ఇ డి లైట్ల సంఖ్య రెండు కోట్లు దాటింది. ఈ బల్బులు తక్కువ కరెంటును వినియోగిస్తూ ధారాళంగా వెలుగునిస్తాయి. దీంతో కరెంటు ఆదా అవుతుంది. ప్రభుత్వ లెక్కవ ప్రకారం, 73 లక్షల యూనిట్ల విద్యుత్తు ఆదా అవుతుంది. అంటే రోజుకు దాదాపు 2 కోట్ల 90 లక్షల రూపాయల మేర ఆదా అవుతుందట.
2018 నాటికి దేశ వ్యాప్తంగా 77కోట్ల ఎల్ ఇ డి బల్సులు ఏర్పాటు చేయాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.
విద్యుత్ ఆదా చేసే ఎల్ ఇ డి బల్బుల వినియోగంలో ఏపీ అగ్ర స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 65.2 లక్షల ఎల్ ఇ డి బల్బుల ఏర్పాటు జరిగింది. ఈ బల్బుల వల్ల మరో లాభం కూడా ఉంది. పాతకాలపు బల్బులతో పోలిస్తే కార్బన్ డయాక్సైడ్ ను తక్కువగా విడుదల చేస్తాయి. ఇప్పటి వరకు బిగించిన ఎల్ ఇ డి లైట్ల వల్ల రోజుకు 12 వేల టన్నులకు పైగా కార్బన్ డయాక్సైడ్ పరిమాణం తగ్గిందని అంచనా. అంటే పర్యావరణానికి కూడా మేలే. మనకు కూడా కరెంటు బిల్లు ఆదా అవుతుంది. ఇప్పుడు కడుతున్న దాంట్లో చాలా తక్కువ బిల్లు కడితే సరిపోతుంది.