విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే , జనసేన పార్టీ నాయకురాలు లోకం నాగమాధవిపై మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. ఆమెకు చెందిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే మాజీ ఉద్యోగి ఒకరు ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల సమయంలో ఆమె సమర్పించిన అఫిడవిట్లో ఆస్తుల వివరాలను తప్పుగా చూపించారని, కంపెనీ నిధులను అక్రమ మార్గాల్లో మళ్లించారని ఆరోపిస్తూ ఆయన ఆధారాలను సమర్పించారు.
ఎన్నికల సమయంలో ఉద్యోగుల ఖాతాల్లోకి జీతంతోపాటు అదనంగా లక్ష రూపాయలు జమ చేశారని మళ్లీ వాటిని నగదు రూపంలో వెనక్కి తీసుకున్నారని.. ఆ డబ్బులనే ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఆ ఉద్యోగి ఆరోపించారు. లక్ష అదనంగా జమ చేసిన వివరాలును ఈసీకి సమర్పించారు. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం, దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ను ఆదేశించింది.
ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించింది. కంపెనీ అకౌంట్స్. బ్యాంకు లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే లోకం నాగమాధవి వర్గీయులుస్పందించారు. సదరు ఉద్యోగిపై గతంలోనే కంపెనీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని, అందుకే కక్షగట్టి ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ దర్యాప్తు జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో కొనసాగుతోంది.

