నాగచైతన్య – కార్తీక్ దండు కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. చైతూకి ఇది 24వ చిత్రం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈలోగా తన ల్యాండ్ మార్క్ సినిమా (25వ చిత్రం) కోసం కూడా రంగం సిద్ధం చేసుకొంటున్నాడు. దర్శకుడు శివ నిర్వాణ చెప్పిన కథకు చైతూ ఓకే చెప్పేశాడు. వీరిద్దరి మధ్యా రెండేళ్ల నుంచీ చర్చలు నడుస్తున్నాయి. 25వ సినిమాగా ఈ కథని పట్టాలెక్కిస్తే బాగుంటుందని చైతూ భావిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించబోతోంది. ఇప్పటికే హీరోకీ, దర్శకుడికీ అడ్వాన్సులు ఇచ్చింది మైత్రీ. ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ రెడీ చేస్తున్నాడు శివ.
వీరిద్దరి కాంబోలో ఇది వరకు ‘మజిలి’ అనే సినిమా వచ్చింది. అది హిట్. ఆ తరవాత శివ `టక్ జగదీష్` అనే సినిమా చేశాడు. కానీ ఫలితం రాలేదు. అప్పట్నుంచి శివ నిర్వాణ మరో అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈసారి కూడా ఫీల్ గుడ్ ఎమోషన్, కాస్త యాక్షన్ తో కూడిన కథ రాసుకొన్నాడని తెలుస్తోంది. ఈ యేడాది చివర్లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
కార్తీక్ దండు సినిమా ఓ మైథలాజికల్ థ్రిల్లర్. ‘వృషకర్మ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఓ భారీ సెట్ వేశారు. అక్కడ కొంతమేర షూటింగ్ జరిగింది. మీనాక్షి చౌదరి కథానాయిక.