బుల్లి తెర యాంకర్గా ఓంకార్ సుపరిచితుడే. అక్కడ గెలిచిన ఓంకార్.. తన క్రియేటివిటీని వెండితెరపై చూపించాలనుకొన్నాడు. తొలి ప్రయత్నంగా జీనియస్ ని తీస్తే…అది కాస్త అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని.. ఈసారి హారర్ కామెడీ అంటూ భయపెట్టాడు. ఓంకార్ సినిమా రాజుగారి గది సూపర్ హిట్ట్ అవ్వడమే కాదు… దాని సీక్వెల్ నాగార్జునతో చేసే అవకాశాన్ని కల్పించింది. ఇటీవలే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లింది. నాగ్ పై ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తీసేశాడు ఓంకార్. వాటిని సరదాగా కట్ చేసి.. రషెష్ని నాగ్కి చూపించాడట.అది చూసి నాగ్ బిత్తరపోయాడని తెలుస్తోంది. `చాలా బాగా తీశావ్… అవుట్ పుట్ ఇలా వస్తుందని ఊహించలేదు. నీలో చాలా ప్రతిభ ఉంది. కచ్చితంగా పెద్ద దర్శకుడు అవుతావ్` అంటూ నాగ్ ఓంకార్కి కితాబులు ఇచ్చాడట. అది చూసి ఓంకార్ పొంగిపోతున్నాడని, సెట్లో ఇంకా కసిగా పనిచేస్తున్నాడని టాక్. సినిమా జరుగుతున్నప్పుడు ఓ అంచనా రావడం కోసం సెట్లోనే ఎడిట్ చేసి రషెష్ చూసుకోవడం మామూలే. కాకపోతే… వాటిని హీరోకి చూపించాలని ఏ దర్శకుడూ అనుకోడు. ఎందుకంటే… ఎఫెక్ట్స్ లేకుండా, రఫ్గా ఎడిట్ చేసి చూస్తే… ఎంత గొప్ప సీన్ అయినా చప్పగానే అనిపిస్తుంది. అలాంటిది.. ఓంకార్ రషెష్ని చూపించడం, దానికి నాగ్ కితాబులు ఇవ్వడం.. గొప్ప విషయమే. ఫైనల్ అవుట్పుట్ కూడా ఇలానే వస్తే.. నాగ్ ఖాతాలో, ఓంకార్ ఎకౌంట్లో మరో హిట్ పడిపోవడం ఖాయం.