న్యూఢిల్లీ లో ప్రతిష్టాత్మక ది హిందూ పత్రిక నిర్వహించిన ప్రత్యేక చర్చా వేదిక ది హిందూ మైండ్ టాక్ సిరీస్లో నారా లోకేష్ ఎపిసోడ్ వైరల్ అవుతోంది. ఆయన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునరుజ్జీవనం, అమరావతి రాజధాని నిర్మాణం, నియోజకవర్గాల పునర్విభజన అంశాలతో పాటు, ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన ఏపీ ప్రభుత్వ నూతన జనాభా మేనేజ్మెంట్ విధానంపై క్షేత్రస్థాయి వాస్తవాలను జాతీయ మీడియా ముందు ఉంచారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో మారుతున్న యువత ఆలోచనలు, ఎన్డీఏ కూటమి బంధంపై సాగిన ఈ సంభాషణ అత్యంత ఆసక్తికరంగా సాగింది.
బలవంతం కాదు.. ఇన్సెంటివ్ బేస్డ్ పాలసీ!
రాష్ట్రంలో ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై వస్తున్న విమర్శలను లోకేష్ తనదైన శైలిలో తిప్పికొట్టారు. ఇది ఎవరిపైనా బలవంతంగా రుద్దే విధానం కాదు.. పూర్తిగా స్వచ్ఛందమైన, ప్రోత్సాహకాల ఆధారిత వ్యూహం అని స్పష్టం చేశారు. కుటుంబ నియంత్రణపై ఎవరి వ్యక్తిగత నిర్ణయాలను ప్రభుత్వం శాసించడం లేదని, కాకపోతే ఎక్కువ మంది పిల్లలను కనాలని భావించే కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందనే భరోసా మాత్రమే ఇస్తోందని వివరించారు. ఈ పాలసీపై విమర్శలు చేస్తున్నవారు కేవలం వారి ఊహల్లో సృష్టించుకున్న అంశాలపైనే యుద్ధం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
భవిష్యత్ ముప్పును ముందే ఊహించిన విజన్
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న డెమోగ్రాఫిక్ సవాలును లోకేష్ సంఖ్యాపరమైన సాక్ష్యాలతో జాతీయ మీడియా ముందు ఉంచారు. భారతదేశ సగటు సంతానోత్పత్తి రేటు స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో టి.ఎఫ్.ఆర్ 1.5 కి పడిపోయింది. ఇది రీప్లేస్మెంట్ రేటు 2.1 కంటే చాలా తక్కువ. రాబోయే రోజుల్లో ఇది మరింత తగ్గే ప్రమాదం ఉంది అని హెచ్చరించారు. 1990ల్లోనే ఐటీ విప్లవాన్ని ముందే ఊహించిన సీఎం చంద్రబాబు నాయుడు, ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత రాష్ట్రం ఎదుర్కోబోయే వృద్ధాప్య జనాభా సమస్యను, నియోజకవర్గాల పునర్విభజన ముప్పును దృష్టిలో ఉంచుకునే ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారని లోకేష్ చాటిచెప్పారు.
ప్రతి అంశంపై పక్కా విజన్
కేవలం జనాభా అంశాలే కాకుండా ఏపీ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించడం, అమరావతిని గ్లోబల్ సిటీగా నిర్మించడం , జాబ్స్, జాబ్స్, మోర్ జాబ్స్ అనే నినాదంతో యువతకు ఉపాధి కల్పించడమే తమ కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతని లోకేష్ స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం , ప్రాముఖ్యత దెబ్బతినకూడదనే అంశాన్ని కూడా ఆయన ఈ వేదికపై బలంగా వినిపించారు. తన సొంత రాజకీయ ప్రస్థానాన్ని , ఎన్డీఏ కూటమిలో బీజేపీతో కలిసి పనిచేస్తున్న విధానాన్ని ప్రస్తావిస్తూ.. ఎన్నికల వ్యూహాలు, ప్రచారం నిర్వహించడంలో ఉన్న శక్తి సామర్థ్యాలను నేను బీజేపీ నుంచే నేర్చుకున్నాను అని లోకేష్ వ్యాఖ్యానించడం ఆయన పరిణితికి నిదర్శనం.
హిందూ మైండ్ సీరిస్కు ఇచ్చిన ఇంటర్వ్యూ జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన జనాభా నిర్వహణ, సంతానోత్పత్తి రేటు ప్రోత్సాహకాలపై దేశవ్యాప్తంగా సాగుతున్న చర్చకు ఆయన అత్యంత పరిణతితో, హేతుబద్ధమైన సమాధానాలతో ముగింపు పలికారు. ఈ ఇంటర్వ్యూలో లోకేష్ ప్రదర్శించిన వాగ్ధాటి, సబ్జెక్ట్ పట్ల ఆయనకున్న పట్టు జాతీయ స్థాయిలో ఆయన ఇమేజ్ను మరింత ఉన్నత స్థానానికి ఎలివేట్ చేశాయి.
