యూరీ ఉగ్రవాదుల దాడుల తరువాత భారత ప్రభుత్వం నోట ఒక్కసారి కూడా ‘యుద్ధం’ అనే మాట అనలేదు కానీ తన మాటలతో చేతలతో ఇంచుమించు అటువంటి యుద్ద వాతావరణమే సృష్టించి పాకిస్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకరోజు, పాకిస్తాన్ కి ఇచ్చిన ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాని రద్దు చేసి దానితో వ్యాపార సంబంధాలని తెంచుకొబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తాయి. మరో రోజున, పాక్ తో సింధూ జలాల పంపకాలపై చేసుకొన్న ఒప్పందాన్ని రద్దు చేసుకోబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తాయి. మరొక రోజున పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలు తెంచుకోబోతున్నట్లు వార్తలు వస్తాయి. పాకిస్తాన్ చేత బహిష్కరించబడిన బలూచ్ వేర్పాటువాద నేత బుగ్తీకి రాజకీయ ఆశ్రయం కల్పించబోతున్నట్లు వార్తలు వస్తాయి. ఇప్పుడు తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులతో అత్యవసర సమావేశం అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈరోజు ఆయన తన నివాసంలో ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్, వాయుసేన చీఫ్ అరూప్ రహా, నేవీ వైస్ చీఫ్ తో సమావేశం అయ్యారు.
మీడియాకి ఆ మాత్రం క్లూ అందిస్తే చాలు మిగిలిన స్టోరీ అంతా అవే అల్లేసుకోగలవు. వారు ఏమి మాట్లడుకోన్నారో మీడియాకి తెలియకపోయినా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి భారత సేనలని పంపించి అక్కడ దాగున్న ఉగ్రమూకలని ఏరివేయడానికే ఆయన వారితో సమావేశం అయ్యారనో లేకపోతే పాకిస్తాన్ తో ప్రత్యక్ష యుద్దం చేయడం గురించి చర్చిస్తున్నారనో వ్రాసుకొనే సౌలభ్యం వాటికి ఉంది. భారత్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు చూసి పాకిస్తాన్ ప్రభుత్వం ‘యుద్ధం యుద్ధం’ అంటూ తెగ పలవరిస్తోంది. అంతే కాదు..నిజంగానే యుద్ద సన్నాహాలు చేయడం మొదలుపెట్టేసింది. దాని యుద్ద విమానాలు పాక్ గగనతలంపై రివ్వు రివ్వున ఎగురుతుంటే, అది చూసి పాక్ ప్రజలు సంతోషపడకపోగా చాలా ఆందోళన చెందుతున్నారు.
ఇదే అదునుగా పాక్ మీడియా కూడా తన టి.ఆర్.పి. రేటింగ్ పెంచుకోవడం కోసం అయితేనేమి లేదా మిగిలిన చానళ్ళ కంటే తాము వెనుకబడిపోకూడదనే తాపత్రయంతోనైతేనేమి పాక్ ప్రభుత్వం చేస్తున్న యుద్ద సన్నాహాల గురించి కధకధలుగా వర్ణించి చెపుతూ ప్రజల ఆందోళనని ఇంకా పెంచి పోషిస్తోంది. పాక్ చేస్తున్న ఈ హడావుడితో తన యుద్ధోన్మాదం గురించి లోకానికి మరొకసారి స్వయంగా చాటుకొన్నట్లు అయ్యింది. పాక్ ప్రభుత్వం, సేనలు చేస్తున్న హడావుడి చూసి, ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ కి గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ హడావుడికి పాక్ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిడుకులకి గురవుతున్నాయి. మదుపరులు తీవ్రంగా నష్టపోతున్నారు. పాక్ ప్రభుత్వం నిర్ణయం కారణంగా కొన్ని విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి.
గమ్మతైన విషయం ఏమిటంటే పాకిస్తాన్ లో ఇంత హడావుడి జరుగుతున్నా భారత్ లో అన్నీ యధాప్రకారమే జరిగిపోతున్నాయి. ఎక్కడ ఆవగింజంత మార్పు లేదు. మీడియాలో వస్తున్న వార్తలు, ఊహాగానాలే తప్ప కేంద్రప్రభుత్వం తరపున ఒక్కసారి కూడా ఎవరూ పాకిస్తాన్ తో తమ ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరించబోతోందనే విషయం అధికారికంగా చెప్పనేలేదు. కేవలం చిన్న చిన్న మీడియా లీకులతోనే మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తన వేళ్ళతో తన కళ్ళు పొడుచుకొనేలా చేస్తోంది. రక్తం చుక్క చిందకుండా, కూర్చొన్న కుర్చీలో నుంచి లేవకుండా ఇలాగ కూడా యుద్ధం చేయవచ్చని మోడీ చూపిస్తున్నారు. గ్రేట్!