బాహుబలి – ది కన్క్లూజన్ కోసం తెలుగు ప్రేక్షకులే కాదు, యావత్ భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బాలీవుడ్ నటులు, దర్శకులు కూడా బాహుబలి 2 ఎప్పుడా.. అని కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. ఆ జాబితాలో క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ కూడా చేరాడు. ధోనీ జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కింది. దీన్ని తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ధోని హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడ జేఆర్సీ ఫంక్షన్ హాల్లో ధోనీ – ద అన్ టోల్డ్ స్టోరీ సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ ”బాహుబలి సినిమా చూశా. రాజమౌళి సినిమాలన్నీ బాగుంటాయి. బాహుబలి 2 కోసం అందిరితో పాటు నేను కూడా ఎదురుచూస్తున్నా. నాకు హైదరాబాద్ బిరియానీ అంటే ఇష్టం. 2000 వ సంవత్సరంలో హైదరాబాద్ వచ్చా. అప్పటి నుంచీ ఈ నగరం బాగా నచ్చింది. చార్మినార్ గాజులన్నా ఇష్టమే” అన్నాడు. ధోనీ తన అభిమాన క్రికెటర్ అని, ధోనీ వ్యక్తిత్వం గొప్పగా ఉంటుందని రాజమౌళి తెలిపారు.
ఈసారి వచ్చినప్పుడు రాజమౌళి ఇంటికి వస్తానని ధోనీ ఈ సందర్బంగా మాట ఇచ్చాడని తెలుస్తోంది. అయితే చెన్నైలోనూ ధోనీ ఇలాంటి పాటే పాడాడు. చెన్నైలో ఉన్నప్పుడు రజనీకాంత్, సూర్యల ఫ్యాన్ అని చెప్పిన ధోని, హైదరాబాద్లోకి అడుగుపెట్టాక రాజమౌళి, బాహుబలి, హైదరాబాద్ బిరియానీల గురించి మాట్లాడాడు. పరిస్థితులకు, ప్రాంతాలకూ తగ్గట్టుగా మాట్లాడడం సినిమా స్టార్లకూ, రాజకీయ నాయకులకే తెలుసనుకొంటే.. ఆ జాబితాలో క్రికెటర్లూ చేరిపోయారు.