వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, తెదేపా తమ్ముళ్ళు గొంతు చించుకొంటున్నా, జగన్ మాత్రం తాను ఊరికి ఉపకారిననే భావిస్తుంటారు. అందుకే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. దాని గురించి తెలియని విద్యార్ధులకి, యువతకి యువభేరి పేరిట “ఎక్స్ పర్ట్ అడ్వైజ్” ఇస్తున్నారు. ఈ సబ్జెక్ట్ మీద తన అనుభవాలని, జ్ఞానాన్ని అందరితో పంచుకొంటున్నారు. ఇప్పుడు విదేశాలలో ఉన్న తన అభిమానులకి కూడా దానిని ఉచితంగా పంచిపెట్టబోతున్నారు. అయితే అందుకోసం ఆయన రెక్కలు కట్టుకొని విదేశాలకి వెళ్ళడం లేదు. హైదరాబాద్ లోని తన లోటస్ పాండ్ కార్యాలయంలో కూర్చొనే ఎన్.ఆర్.ఐ. లతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లడబోతున్నారు. ప్రపంచంలో 5 వివిధ దేశాలలోని ఎన్.ఆర్.ఐ.లతో ఆయన మాట్లాడబోతున్నారు. ఆదివారం రాత్రి భారత కాలమాన ప్రకారం 8గంటల నుంచి ప్రత్యేక హోదాపై ఆయన వద్ద నుంచి “ఎక్స్ పర్ట్ అడ్వైజ్” పొందవచ్చు. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం దక్కనివాళ్ళు సాక్షి మీడియాలో లైవ్ టెలీకాస్ట్ ని వీక్షించి తమ ప్రత్యేక అనుమానాలని నివృతి చేసుకోవచ్చు లేదా ఆ కార్యక్రమాన్ని యూ-ట్యూబ్ లో కూడా చూసి తమ అనుమానాలను నివృతి చేసుకోవచ్చు.
గతంలో ఆయన ఓదార్పుయాత్ర పేరిట ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నాలు చేసి మంచి ఫలితాలు రాబట్టారు. ఆ తరువాత సమైఖ్యాంధ్ర ఉద్యమాలు చేశారు. దానికీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయన విజ్ఞప్తి మేరకు ఆ సభలకి వచ్చిన జనాలు డిల్లీ పాలకులకి వినబడేట్లు గట్టిగా చప్పట్లు కొట్టారు కానీ అదే చేత్తో వైకాపా ఓట్లు వేయకపోవడంతో ఆయన ‘ఆశయం’ నేరవేరలేదు. ఆయనే గనుక ముఖ్యమంత్రి అయ్యుంటే ప్రధాని నరేంద్ర మోడీ మెడ వంచి మరీ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తప్పకుండా వెనక్కి తీసుకొనేలాగ చేసి ఉండేవారు. ఆ సభలలో జగన్ అలాగే చెప్పారు మరి!
ఆ తరువాత ప్రత్యేక హోదా అంశం గురించి కాంగ్రెస్ పార్టీ గుర్తుచేసే వరకు ఆయన దాని గురించి ఆలోచించకపోయినా, ఇప్పుడు పగలు రాత్రి దాని గురించే ఆలోచిస్తున్నారు. అందరినీ ఆలోచించమని పట్టుబడుతున్నారు. దాని గురించి తను ఆలోచించినంత కాలం రాష్ట్ర ప్రజలని కూడా ఆలోచించేలాగ చేయడం మామూలు విషయమేమీ కాదు. కానీ చేస్తున్నారు గనుక జగన్ చాలా గ్రేట్ అని తెదేపా వాళ్ళు కూడా ఒప్పుకోక తప్పదు. కనుక ఆయనని ఏవిధంగా మరిపించాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఆలోచించాల్సి ఉంటుంది.