నక్సలిజం, మావోయిజం కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడిన రాష్ట్రాల్లో ఏపీ ఉంటుంది. ఉమ్మడి ఏపీలో ఎంతో మంది నేతలు నక్సల్స్ చేతుల్లో హతమయ్యారు. దుద్దిళ్ల శ్రీపాదరావు నుంచి కిడారి సర్వేశ్వరరావు వరకూ చాలా మంది ప్రజా నాయకులు అకారణంగా.. కేవలం వారి ఉనికి నిలబెట్టుకోవడానికి చంపేశారు. భద్రతా బలగాలను ఎంత మందిని చంపారో లెక్కలేదు. అయితే తర్వాత మావోయిస్టుల ప్రభావం తగ్గిపోయింది. ఏవోబీలో మాత్రమే అంతంతమాత్రం ఉండేవారు. ఆపరేషన్ కగార్ ను క్లైమాక్స్ కు తీసుకు వచ్చాక… చివరి ఘట్టం ఏపీలోనే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
లీడర్, క్యాడర్ ఎవరూ లేరు !
మావోయిస్టుల భావజాలం గురించి పక్కన పెడితే ప్రస్తుత కాలంలో వారి పోరాట విధానమే అసహజం. ఎక్కడ ఉన్నా మనిషిని ఇట్టే కనిపెట్టగలిగే టెక్నాలజీ వచ్చింది. వీరు అడవుల్లో కి వెళ్లినప్పుడు కనీసం సెల్ ఫోన్ కూడా ఉండేది కాదు. ఆ సమయంలో.. ఆ నక్సల్స్ మైదాన ప్రాంతాల్లో యథేచ్చగా తిరిగినా గుర్తు పట్టేవారు ఉండరు. కానీ ఇప్పుడు అలా లేదు. మొత్తం బహిరంగం అయిపోయింది. అంతకు మించి భావజాలం బలహీనపడిపోయింది. అంతర్గత సమస్యలతో చీలికలు పేలికలు అయి.. పోలీసులకు సమాచారం ఇచ్చేవారు ఎక్కువయ్యారు. ప్రభుత్వం కూడా నక్సల్స్ సమస్యను పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. అందుకే లొంగిపోయిన వాళ్లు లొంగిపోగా..మిగిలిన వాళ్లను పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు లీడర్, క్యాడర్ ఎవరూ లేరు.
హిడ్మా ఊపిరి పోస్తాడనుకున్న సానుభూతిపరులు
మావోయిస్టులకు .. బహిరంగంగా కొంత మంది మద్దతు పలుకుతూంటారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ చెప్పినట్లుగా .. వీరు మావోయిస్టు సానుభూతిపరుల పేరుతో దందాలు చేసుకుంటూ లగ్జరీ లైఫ్ గడుపుతారు. కానీ యువతను రెచ్చగొడుతూంటారు. ఇలాంటి వారంతా హిడ్మా ఉన్నంత కాలం మావోయిస్టు పార్టీ ఎప్పటికైనా రైజ్ అవుతుందని చెబుతూంటారు. అయితే ఇప్పుడు ఆ హిడ్మా లేరు. మావోయిస్టు పార్టీకి ఇప్పుడు లీడర్ గా భావిస్తున్న దేవ్ జీ ఆచూకీ తెలియడంలేదు. పోలీసుల వద్దే ఉన్నారని. ఈ సానుభూతి పరులు అంటున్నారు.
ముందే ముగుస్తున్న నక్సలిజం
వచ్చే ఏడాది మార్చి31 వరకు కేంద్రం టార్గెట్ పెట్టుకుంది. కానీ దళాలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి. చివిరికి దేవ్ జీ కూడా దొరికిపోయారని చెబుతున్నారు. చత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతంలోనే వీరు ఉండలేక విజయవాడకు వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారంటే.. ఎక్కడా బతుకు లేదని అర్థం. మిగిలిపోయిన మావోయిస్టులు వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మందే ఉంటారు. వారందర్నీ కూడా లొంగిపోయేలా చేయడమో.. లేకపోతే వేరే మార్గమో చూసి.. తెలుగు నేలపైనే నక్సలిజం అంతం అనే ప్రకటన చేసినా ఆశ్చర్యం ఉండదు. నక్సలైట్లను చంపగలరు కానీ.. నక్సలిజాన్ని చంపలేరని కొంత మంది అంటూ ఉంటారు.. తుపాకీ గొట్టంతోనే రాజ్యాధికారం అనే మూల సిద్ధాంతమే నక్సలిజం అయితే.. నక్సలిజం కూడా అంతమయినట్లే. అందులో సందేహం ఉండదు.

