మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గట్టి షాక్ ఇచ్చింది. ఏడాది పాటు టెండర్లలో పాల్గొనకుండా నిషేధం విధించింది. దీనికి కారణం నాసిరకం పనులు చేయడమే. కేరళలోని చెంగల – నీలేశ్వరం సెక్షన్లోని NH-66కు సంబంధించి 77 కిలోమీటర్ల పనులను మేఘా సంస్థ దక్కించుకుంది. పనులు చేసింది. కానీ అవి జాతీయ రహదారుల స్థాయి నాణ్యతగా లేవు. రోడ్డు ఓ వైపు వంగిపోయినట్లుగా ఉండటంతో పాటు సరైన డ్రైనేజీ వ్యవస్థను నిర్మించలేదు.
ఈ రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించిన NHAI తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రూ. 9 కోట్ల వరకు జరిమానా విధించింది. రహదారి నిర్మాణ సమయంలోనే మేఘా నిర్వాకాలు బయటపడ్డాయి. కాసరగోడ్ జిల్లాలోని పనులు జరుగుతున్న సమయంలో వంతెనల నిర్మాణాలు కూలిపోయాయి. వాటిపై నాయ్ ఇంజినీర్లు దర్యాప్తు సరైన డిజైన్ లేకపోవడం, నాణ్యతగా పనులు చేయకపోవడాన్ని గుర్తించి రిపోర్టు తయారుచేశారు.
మేఘా సంస్థ ఈ కాంట్రాక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ప్రకారం పొందింది. రోడ్ నిర్మించడమే కాకుండా 15 సంవత్సరాలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పుడు ఆ రోడ్ ను మళ్లీ ప్రమాణాల ప్రకారం నిర్మంచాల్సి ఉంది. మేఘా ఇంజినీరింగ్ ఎక్కువగా ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల్ని చేస్తుంది. రోడ్ కాంట్రాక్ట్ వంటి పనులను ఇతర రాష్ట్రాల్లో పొందింది. తెలుగు రాష్ట్రాల్లోనూ మేఘా చేపట్టిన పలు ప్రాజెక్టులపై వివాదాలున్నాయి. కానీ బయటకు రావడం .. చర్చల్లో ఉండటం.. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం దాదాపుగా ఉండదు.