కాళేశ్వరం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేసిన నూనె శ్రీధర్ పై ఏసీబీ దాడులు చేసింది. కళ్లు చెదిరే ఆస్తులను బయట పెట్టింది. కోట్లు ఖరీదు చేసే విల్లా, అత్యంత లగ్జరీ స్కై స్క్రాపర్ ఫ్లాట్, పలు చోట్ల నాలుగు అంతస్తుల భవనాలు, స్థలాలు, పొలాలు, బంగారం.. హోటళ్లలో పెట్టుబడులు.. అంతేనా కుమారుడి పెళ్లి ధాయ్ల్యాండ్లో డెస్టినేషన్ వెడ్డింగ్. కనీసం పది కోట్లు ఖర్చు చేసి ఉంటారని అంచనా. ఇంకా సోదాలు సాగుతున్నాయి. ఎంత వెనకేశారో.. ఎంత ఖర్చు చేసారో లెక్కలు రావాల్సి ఉంది. ీ ఈ ప్రాజెక్టులో ఈఈ చాలా చిన్న వ్యక్తి అనుకోవచ్చు. పైకి పెరిగేకొద్దీ ఆ ప్రాజెక్టు ఎంత మందికి కల్పవృక్షంగా మారిందో అంచనా వేయడం కష్టం.
నూనె శ్రీధర్ ఆస్తులు బయటపడటంతో.. కాళేశ్వరంలో అవినీతి గురించి .. ఇప్పుడు మరోసారి చర్చ ప్రారంభమయింది. ఏసీబీ అధికారులు పక్కగానే ఉన్నారు. శ్రీధర్ నుంచి ప్రారంభించి .. పై స్థాయి వరకూ కాళేశ్వరం పేరుతో తమ ఖజానాను నింపుకున్న వారి ఖాతాలన్నీ బయట పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఏ ఐఎఎస్ ఆఫీసర్ తన కుమార్తె పెళ్లిని.. హైదరాబాద్లోనే అత్యంత లగ్జరీ హోటల్.. ఒక్కప్లేట్ భోజనం లక్ష ఉంటుందని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేసిన.. ఫలక్ నుమా ప్యాలెస్ లో నిర్వహించారు. అలాగే స్టార్ హోటళ్లలో సంగీత్..రిసెప్షన్ వంటివి నిర్వహించారు. అవన్నీ కాళేశ్వరం పనులు చేస్తున్న ఓ కాంట్రాక్ట్ కంపెనీ చెల్లించినట్లుగా ఆధారాలు బయటకు వచ్చాయి. అన్నింటినీ ఆరా తీసే అవకాశం ఉంది.
కిందిస్థాయిలోనే కాళేశ్వరం పేరుతో ఇంత కొట్టేస్తే.. ఇక పై స్థాయి వారికి కమిషన్లు ఏ రేంజ్ లో అందిఉంటాయో అంచనా వేయడం కష్టం కాదు. కేవలం తొమ్మిదేళ్లలోనే 80వేలకోట్ల నిధులు ఖర్చు పెట్టారంటే.. అందులో ఎవరి వాటాలు ఎంతో.. బయటకు తేవాల్సి ఉంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టులో అవకతవకలు, విధానపరమైన తప్పుల గురించి బయటపడేనాటికి.. ఈ వ్యవహారంలో దోచుకున్న సంపద మొత్తం బయటకు తీసేందుకు ఏసీబీ అధికారులు రెడీ అయ్యే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మరింత సంచలనాత్మకమైన ఏసీబీ దాడులు జరగనున్నాయని అనుకోవచ్చు.